చచ్చేలోపు ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి: ఆమ‌ని

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ ఆమ‌ని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన `జంబలకిడిపంబ`తో సినీ రంగ‌ప్ర‌వేశం చేసిన ఆమ‌ని.. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత ఈమె న‌టించిన `శుభలగ్నం` సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆమ‌ని వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో వ‌రుస‌ ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ దూసుకుపోయింది. కెరీర్ ఆరంభంలో ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా, మ‌రెన్ని అవ‌మానాలు జ‌రిగినా.. వాటిని అధిగ‌మించి త‌న‌దైన అందం, అభిన‌యం అంత‌కు మించిన టాలెంట్‌తో అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే కోలీవుడ్‌ నిర్మాత ఖాజా మొహియుద్దీన్‌ను పెళ్ళి చేసుకొని సినిమాల‌కు దూర‌మైంది.

కానీ, 2003లో రాంగోపాల్ వర్మ తెర‌కెక్కించిన `మధ్యాహాన్నం హత్య`తో ఆమ‌ని మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స‌త్తా చాటుతూనే మ‌రోవైపు బుల్లితెర‌పై సీరియ‌ల్స్‌లోనూ న‌టిస్తోంది. ఇక‌పోతే త‌న‌ మేనకోడలు హ్రితిక న‌టించిన `అల్లంత దూరాన` మూవీని ప్ర‌మోట్ చేయ‌డం కోసం ఆమ‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా త‌న‌ మ‌న‌సులో ఉన్న అతి పెద్ద కోరిక‌ను ఆమె బ‌య‌ట పెట్టారు. `ఒక నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది. అయితే నాకు చ‌చ్చేలోపు ఒక్క‌సారైనా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌నుంది. ఆయ‌న సినిమాలో చిన్న పాత్ర దొరికినా ఖ‌చ్చితంగా చేస్తా` అంటూ ఆమ‌ని చెప్పుకొచ్చారు. మ‌రి ఆమ‌ని కోరిక నెర‌వేరుతుందో.. లేదో.. చూడాలి.