హోదాపై తోక ముడుస్తారా? చంద్ర‌బాబు ఫైర్‌

ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తోడ‌ముడిచార‌ని.. టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్య‌బ‌ట్టారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేంద్ర హోంశాఖ అజెండాలో హోదా అంశం పేర్కొన‌డాన్ని తమ ఘనతగా చెప్పుకున్న వైసీపీ నేతలు.. అజెండా నుంచి దానిని తీసేయ‌గానే.. దీనిని టీడీపీకి ముడిపెట్టి బురద చల్లడమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని.. ఎంపీల‌ను ఇవ్వండ‌ని ప్ర‌జ‌ల‌ను వేడుకున్న జ‌గ‌న్‌రెడ్డి.. ఇప్పుడు ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా కాదు క‌దా.. క‌నీసం.. కేంద్రం నుంచి వ‌న‌రులు కూడా ద‌క్కించుకోలేక పోతున్నార‌నిబాబు విమ‌ర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా.. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకంటే దారుణంగా ఏపీని దిగజార్చారని ఆగ్రహ వ్యక్తం చేశారు. అప్పులు పెరిగిపోతున్నా.. జ‌గ‌న్‌రెడ్డికి చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేద‌ని.. బాబు విమ‌ర్శించారు. ఇంత అప్పులు చేసిన రాష్ట్రం దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు. క‌నీసం.. అప్పులు పెరిగిపోతున్నాయి.. వీటిని ఎలా తీరుద్దామ‌నే స్పృహ కూడా ఈ ముఖ్య‌మంత్రికి లేకుండా పోయింద‌ని.. దుయ్య‌బట్టారు.

చేసిన అప్పులు ఎలా తీరుస్తారో.. ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని.. చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. లేని సమస్యను సృష్టించి జగన్ సినిమా హీరోలను ఘోరంగా అవమానించారన్న చంద్రబాబు.. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్ను ప్రాధేయపడలా అని ఆక్షేపించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారని దుయ్యబట్టారు. గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చెయ్యడమే నాడు-నేడు పథకమని విమర్శించారు.

పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసీపీ అవినీతిపై టీడీపీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోయినా.. అధిక బిల్లులు వస్తుండటాన్ని తప్పుపట్టారు. విశాఖ ఉక్కుపై ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపును ప్రభుత్వం నిలిపివేయ్యాలన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రానికి త‌ల వంచేది లేద‌ని చెబుతుంటే.. ఏపీ ప్ర‌బుత్వం మాత్రం పాద‌సేవ చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. రైతుల‌కు మీట‌ర్లు పెట్ట‌డం వెనుక కేంద్రానికి లొంగిపోవ‌డ‌మే ఉంద‌న్నారు. ప్ర‌తి విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రాధాన్యం ఇస్తున్న జ‌గ‌న్‌రెడ్డి.. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదేన్నారు.