వ్యూహ‌క‌ర్త‌ను మార్చిన బాబు.. ఇక ప‌రుగులేనా?

తెలుగు దేశం పార్టీ మ‌నుగ‌డ కోసం త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం అవ‌స‌రం. లేదంటూ ఆయ‌న రాజ‌కీయ కెరీర్కు ముగింపు ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీని ఆ దిశ‌గా సిద్ధం చేస్తున్నారు. నియోజ‌వ‌కవర్గాల వారీగా ఇంఛార్జీల‌ను నియ‌మిస్తూ సాగుతున్నారు. అయితే తాజాగా ఆయ‌న త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ను మార్చార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రాబిన్ శ‌ర్మ స్థానంలో ప్ర‌శాంత్ కిషోర్ టీంలోని సునీల్‌ను తీసుకున్నార‌ని చెబుతున్నారు.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ బాబు ఇంఛార్జీల‌ను నియ‌మించ‌లేదు. అక్క‌డ యువ‌కుల‌కు అవ‌కాశం ఇద్దామ‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలిసింది. ఆర్థిక‌, సామాజిక ప‌రంగా అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆయ‌న ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జీల‌ను నియ‌మించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేస్తూ ఈ ఎంపిక‌లు చేస్తున్నారు. యువ‌కులైతే ఈ రెండేళ్ల పాటు పార్టీని నియోజ‌క‌వ‌ర్గాల్లో ధైర్యంగా న‌డ‌ప‌గ‌ల‌ర‌ని ఆయ‌న న‌మ్ముతున్నార‌ని స‌మాచారం. అందుకే త్యాగాల‌కు సిద్ధంగా ఉండాల‌ని సీనియ‌ర్లుకు సంకేతాలిచ్చార‌ని టాక్‌.

ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రాబిన్ శ‌ర్మ టీంతో ఒప్పందం కుదుర్చుకున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నార‌ని తెలిసింది. గ‌త కొన్ని నెల‌లుగా రాబిన్ శ‌ర్మ టీం నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వేలు నిర్వ‌హిస్తోంది. కానీ వాటిపై నమ్మ‌కం లేక‌నే బాబు తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ టీమ్‌లోని సునీల్‌తో ఒప్పందం చేసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఈ వ్యూహ‌క‌ర్త ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అనేదానిపై పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంలో పీకే కీల‌క పాత్ర పోషించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న జ‌గ‌న్తో క‌లిసి పనిచేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో పీకే టీమ్‌కే చెందిన సునీల్‌తో బాబు ఒప్పందం చేసుకోవడం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. దీనిపై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.