‘ఖైదీ’ సీక్వెల్‌కి లైన్‌ క్లియర్‌‌

వెరైటీ కథలతో మెప్పించే కార్తి.. ‘ఖైదీ’ సినిమాతో మరింత వైవిధ్యతను చూపించాడు. హీరోయిన్‌ ఉండదు. రొమాన్స్ లేదు. పాటలు అంతకన్నా లేవు. రొటీన్‌ ఫార్మాట్‌కి పూర్తి భిన్నంగా ఉండే కాన్సెప్ట్. ఒకే ఒక్క రాత్రిలో కథంతా జరుగుతుంది. పైగా అతను సినిమా అంతా ఒకే డ్రెస్‌తో ఉంటాడు. ఇలాంటి సినిమా చేయడం నిజంగా సాహసమే.      అయినా కూడా వహ్వా అనిపించాడు కార్తి.

తన పర్‌‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి హిట్టు కొట్టాడు. అందుకే ఈ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్ చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యి సరిగ్గా సెట్స్‌కి వెళ్లే సమయానికి ఓ సమస్య వచ్చింది. ‘ఖైదీ’ కథ తనదంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు.     

తమిళనాడులో ఉన్న ఒక జైలులోని ఖైదీ జీవితం ఆధారంగా తాను ఈ కథ రాసుకున్నానని, 2007లో నిర్మాత ఎస్ఆర్‌‌ ప్రభుతో చెబితే సినిమా తీద్దామని చెప్పి తనకి పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని రాజీవ్ రంజన్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. ఇప్పుడు తన అనుమతి లేకుండా సినిమా ఎలా తీసేస్తారని, లాభాల్లో తనకి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.       

దానికి ప్రభు వెంటనే రియాక్టయ్యాడు. అవన్నీ అబద్ధాలని, విషయం తాను కోర్టులోనే తేల్చుకుంటానని చాలెంజ్ చేశాడు. ఇప్పుడా చాలెంజ్‌లో తను నెగ్గాడు. ఇది లోకేష్ రాసుకున్న సొంత కథేనని ప్రూవ్ కావడంతో కోర్లు కేసును కొట్టేసింది. దాంతో అతి త్వరలో మూవీని సెట్స్కి తీసుకెళ్లబోతున్నారు. మరోవైపు ‘ఖైదీ’ హిందీ రీమేక్ షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. కార్తి పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు.