ద‌మ్ముంటే.. న‌న్ను జైలుకు పంపండి: కేసీఆర్ స‌వాల్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీల‌పై విరుచుకుప‌డ్డారు. ర‌ఫేల్ ఒప్పందంలో గోల్ మాల్ జ‌రిగింద ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దమ్ముంటే తనను జైలుకు పంపాలని బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని అన్నారు. బీజేపీ తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసిందని ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్లో గెలవకపోయినా బీజేపీ దొడ్డిదారిలో పాలిస్తోందన్నారు. మహారాష్ట్రలోనూ గెలవకపోయినా పాలించాలని యత్నించి.. బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు.

రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగిందని కేసీఆర్ ఆరోపించారు. మనకంటే చౌకగా ఇండోనేషియా రఫేల్‌ విమానాలు కొన్నద‌ని తెలిపారు. బీజేపీ పాలకుల అవినీతి చిట్టా త‌న దగ్గర ఉంద‌న్నారు.  అవినీతి గురించి ఢిల్లీలో పంచాయతీ పెడతాన‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. “మీకు దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి. నన్ను జైల్లో పెట్టుడు కాదు.. మేం మిమ్మల్ని జైలుకు పంపేది మాత్రం పక్కా. ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ“ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేదొకటి.. చేసేదొకటి అని కేసీఆర్‌ ఆరోపించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు తెచ్చిందని.. కేంద్ర ముసాయిదా బిల్లు అంశాలను  వివరించారు. సాగు రంగం ఆశాజనకంగా లేదని కేంద్రం చెబుతోందన్న ఆయన సాగు కోసం కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడద నేది కేంద్ర విధానమని మండిపడ్డారు. వంద శాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారని కేసీఆర్ తెలిపారు.

మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని పిలిచానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ బహిరంగ సభలో ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారని సీఎం ఆరోపించారు. యూనిట్‌కు రూ.11 చొప్పున కొని రూ.1.10కే రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారని తెలిపారు. కేంద్రం ఎన్నడూ రూ.1.10కు ఏ రాష్ట్రానికి విద్యుత్‌ ఇవ్వలేదన్నారు. కేంద్ర అబద్దాలపై చర్చకు రావాలన్నా బీజేపీ నేతలు ముందుకు రారన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.

“విద్యుత్‌ సంస్కరణలు తెస్తున్నారు.. అందులో భాగంగా ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారు. ఆ బిల్లుపై 7, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. విద్యుత్‌ సంస్కరణలు వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. సంస్కరణలు అమలు చేస్తే అరశాతం ఎఫ్ఆర్‌బీఎం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారు. విద్యుత్‌ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు. అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్‌లో కూడా చెప్పారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయే అవకాశముంది. అయినా సరే, మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పాం.“ అని కేసీఆర్ తెలిపారు.