ప్ర‌త్యేక హోదా టాపిక్ ఔట్‌… ఏపీకి షాకిచ్చిన కేంద్రం

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఒక్క రోజులోనే.. చెప్పాలంటే కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేంద్రం ఊహించని షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. ఎజెండాలో తొలుత పెట్టిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని త‌ర్వాత తొల‌గించింద‌ని తెలుస్తోంది. స‌హ‌జంగానే, ఈ కీల‌క అంశం తొలగించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప‌రిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండిపోయిన‌ విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ.. ఆ మేరకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి ఈ నెల 17 న సమావేశం ఏర్పాటుచేసి విభజన సమస్యలపై చర్చించేందుకు ఎజెండా ఖరారు చేసింది. కేంద్ర హోంశాఖ నియమించిన త్రిసభ్య కమిటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు.

ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హోంశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, ఎజెండాలో తొలుత చేర్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు క‌బురు అందిందని స‌మాచారం.

త్రిస‌భ్య క‌మిటీలో మొత్తం 9 అంశాలకు గాను ఇప్పుడు చర్చలను 5 అంశాలకే పరిమితం చేసినట్లు సమాచారం. అయితే, ఈ తొల‌గించిన వాటిలో ప్ర‌త్యేక హోదా ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తే తలనొప్పులు వస్తాయని కాబోలు కేంద్రం తాజాగా ఎజెండాలోని ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ ప‌రిణామం వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారుకు ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.