బీజేపీ కంచుకోటలో పవర్ఫుల్ మహిళ

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గోరఖ్ పూర్ కూడా ఒకటి. ఎందుకంటే గోరఖ్ పూర్ అనేది యోగి కంచుకోట. ఇక్కడి నుండే యోగి ఐదు సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు. అలాంటిది మొదటిసారి యోగి గోరఖ్ పూర్ అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు. యోగి అంటే బీజేపీ తరపున ఎంతటి బలమైన అభ్యర్ధో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  అలాంటి యోగిపై ఎస్పీ ఒక మహిళను వ్యూహాత్మకంగా పోటీలోకి దింపింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా ఘనంగా ఉండటం వల్లే వీళ్ళ పోటీపై అందరి దృష్టి పడింది.

ఇంతకీ విషయం ఏమిటంటే యోగీపై ఎస్పీ అభ్యర్ధిగా సుభావతి శుక్లా పోటీ చేస్తున్నారు. ఈమె ఎవరంటే ఒకపుడు బీజేపీలో బలమైన నేతల్లో ఒకరైన ఉపేంద్ర దత్ శుక్లా భార్య. ఉపేంద్ర ఎన్ని పార్టీలు మారినా బ్రాహ్మణ సామాజికవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు. అలాంటి ఈయన 2020లో మరణించారు. మరణించేంత వరకు ఉపేంద్రకు యోగికి ఏ మాత్రం పడేది కాదు. నాలుగుసార్లు ఉపేంద్ర పోటిచేసినా ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకు యోగి రాజకీయమే కారణమని బీజేపీలోనే చెప్పుకునేవారు.

పార్టీ బలోపేతానికి ఉపేంద్ర చాలా కష్టపడ్డారు. అయితే బద్ధ శత్రువు యోగి దెబ్బకు పెద్దగా ఎదగలేకపోయారు. అలాంటి ఉపేంద్ర కొడుకు అమిత్ దత్ శుక్లా గోరఖ్ పూర్ లోనే మరో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించాడు. అయితే అమిత్ కు టికెట్ రాకుండా యోగీనే అడ్డుపడ్డడానే టాక్ ఉంది. దాంతో యోగిని తట్టుకోవటం కష్టమనే భావనతోనే తల్లి, కొడుకులు ఎస్పీలో చేరిపోయారు. తండ్రి ఉపేంద్రకు లాగే కొడుకు అమిత్ కు కూడా మంచి పేరే ఉంది.

ఇపుడు యోగీపై ఉపేంద్రను కాకుండా సుభావతిని పోటీలోకి దింపటంలో అఖిలేష్ వ్యూహముంది. అదేమిటంటే మొదటిది ఉపేంద్ర మరణం తాలూకు సెంటిమెంటును సొంతం చేసుకోవటం. రెండోది మహిళల ఓట్లు రాబట్టుకోవడం. మూడోది బ్రాహ్మణ ఓట్లు గంపగుత్తగా సుభావతికే పడతాయనే అంచనా. 

ఇప్పటికే ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన యోగిపై బ్రాహ్మణులు మండిపోతున్నారు. కాబట్టి యోగిని ఓడించేందుకు బ్రాహ్మణులు, యాదవులు, జాట్లు, ముస్లింలు, బీజేపీ అంటే పడని వారు, మహిళల ఓట్లు సుభావతికే  పడతాయని అంచనాతోనే టికెట్ ఇచ్చారు. అఖిలేష్ అంచనా ఫలిస్తే సంచలనమే అవుతుంది.