సైలెంటుగా సెట్ చేస్తున్న మెగా హీరో

వరుణ్ తేజ్ కెరీర్లో అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. 2019లో తక్కువ వ్యవధిలో ఎఫ్-2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అతను.. రెండేళ్లకు పైగా రిలీజ్ లేకుండా ఉన్నాడు. ఇందుకు కరోనానే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా వల్ల అందరు హీరోలూ ఇబ్బందిపడ్డారు కానీ.. వరుణ్ ఇబ్బంది ఇంకాస్త ఎక్కువే. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, పెద్ద స్థాయిలో తెరకెక్కించిన సినిమా కావడంతో ‘గని’ మేకింగ్‌కు చాలా టైం పట్టింది. సినిమా పూర్తయ్యాక కూడా విడుదల విషయంలో ఆలస్యం జరిగింది.

డిసెంబర్లోనే రావాల్సిన ఈ చిత్రం.. వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న రిలీజ్ చేస్తామని ప్రకటించడం తెలిసిందే. కానీ ఫిబ్రవరి 25 దగ్గర పడుతున్నా డేట్ ఖరారు కాలేదు. అలాగని సినిమా వాయిదా పడుతుందా అంటే అలాంటి సంకేతాలు కూడా కనిపించడం లేదు.ఫిబ్రవరి 25కు షెడ్యూల్ అయిన ‘భీమ్లా నాయక్’ ఇంకా ఆ డేట్‌ను వదిలి పెట్టలేదు.

వాయిదా పక్కా అని అంతర్గతంగా చెబుతున్నప్పటికీ.. పైకి మాత్రం ఆ విషయాన్ని చెప్పట్లేదు. దీంతో ‘గని’ టీంకు అయోమయం తప్పట్లేదు. అలాగని వాళ్లు శివరాత్రి వీకెండ్ మీద ఆశలు వదులుకోలేదు. సైలెంటుగా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేయించి ఫస్ట్ కాపీ రెడీ చేసేశారు. అలాగే యుఎస్ ప్రిమియర్స్‌కు కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి.

ఈ మేరకు యాడ్స్ కూడా ఇస్తున్నారు. కానీ వాటి మీద డేట్ మాత్రం వేయలేదు. ఫిబ్రవరి 25న రిలీజ్ అని అధికారికంగా ప్రకటించలేదు కానీ.. అందుకు ఏర్పాట్లు మాత్రం సైలెంటుగా జరిగిపోతున్నాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో ‘భీమ్లా నాయక్’ వాయిదా వార్త బయటికి రావడం.. ఆ వెంటనే ‘గని’ రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతాయని అంటున్నారు. దీంతో పాటుగా ఆ వీకెండ్లో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘సెబాస్టియన్’, తమిళ అనువాద చిత్రం ‘వలిమై’ కూడా రాబోతున్నాయి.