కోమ‌టిరెడ్డికి చాప్ట‌ర్ క్లోజ్ చేసేసిన కేసీఆర్‌

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. దీనికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే తెలంగాణ‌లో జ‌రిగింది. దీనికి కార‌ణం ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ ర‌థ‌సార‌థి కేసీఆర్‌. తెలంగాణ జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకున్న‌ సీఎం కేసీఆర్ ఈ రోజు జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స్థానిక ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఆస‌క్తిక‌ర రీతిలో ప్ర‌శంస‌లు కురిపించారు. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసి, స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం ప‌ట్ల సీఎం కేసీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అని ఎంపీ కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్ర‌శంస‌ల‌కు కార‌ణం ఎప్ప‌ట్లాగే కేసీఆర్ వ్యూహాలు, కార్యాచ‌ర‌ణ‌!

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న  భువ‌న‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి జ‌న‌గామ జిల్లా వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతికి పూజారి కొబ్బరికాయ అందించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చి కొబ్బ‌రికాయ‌ కొట్టాల్సిందిగా కోరారు. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఎంపీ కోమ‌టిరెడ్డి మీరే కొట్టాలని కోరారు. అయితే, మరోసారి సీఎం కేసీఆర్ మీరే కొబ్బ‌రికాయ కొట్టండ‌ని సూచన చేయడంతో.. కోమటిరెడ్డి ఈ మేర‌కు నారికేళం కొట్టారు.

ఈ కార్య‌క్రమం అనంత‌రం ఎంపీ కోమ‌టిరెడ్డి ప్ర‌సంగిస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు ఎక్క‌డా లేని విధంగా నూత‌న క‌లెక్ట‌రేట్‌లు నిర్మిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్ర‌టేరియ‌ట్‌లు కూడా ఈ విధంగా నిర్మించ‌లేదు. జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం అత్యంత అద్భుతంగా నిర్మించారు అని ఎంపీ కొనియాడారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు జ‌న‌గామ జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అని కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంగా రాష్ట్రానికి స‌రైన ఆదాయం లేక‌పోయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. తెలంగాణ వ‌చ్చింది కాబ‌ట్టి మ‌నం మ‌నం కొట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదని సైతం కోమ‌టిరెడ్డి సూచించారు.

చేర్యాల‌లో రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కోరారు. జ‌న‌గామ‌కు మెడిక‌ల్, పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండింటిని సీఎం త‌ప్ప‌కుండా ఇస్తార‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని సైతం కోమ‌టిరెడ్డి ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ సర్కార్‌, సీఎం కేసీఆర్‌పై అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తీవ్ర విమర్శలు చేసే కోమటిరెడ్డి ఒక టెంకాయ కొట్టించే చాన్స్‌, ఒక కార్య‌క్ర‌మంలో కేసీఆర్ తో పాల్గొనే సంద‌ర్భంల‌తో ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది