ఎమ్మెల్యే సీత‌క్క‌.. అంత‌కు మించి!

ములుగు ఎమ్మెల్యే ధ‌న‌సూరి అన‌సూయను అంద‌రూ సీత‌క్క అని అభిమానంగా పిలుచుకుంటారు. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఆమెను ఎప్పుడూ అక్క‌గా, అమ్మ‌గా మాత్ర‌మే చూస్తారు త‌ప్ప ఒక ఎమ్మెల్యేగా భావించ‌రు. ప్ర‌జ‌ల‌తో అంత‌లా మ‌మేకం అవుతారు సీత‌క్క‌. ఎప్పుడూ సామాజిక‌ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ అంద‌రికీ ఆప్తురాలిగా నిలుస్తున్నారు. అలాంటి సీత‌క్క మ‌రో సామాజిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి ఔరా అనిపించేలా చేశారు.

ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మేడారం మ‌హా జాత‌ర జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వేలాదిగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌తో ఆ ప్రాంతం ఎప్పుడూ సంద‌డిగా ఉంటుంది. జాత‌ర జ‌రిగే నాలుగు రోజులే కాకుండా.. అంత‌కు ముందు, ఆ త‌ర్వాత దాదాపు నెల రోజుల పాటు ఆ ప్రాంగ‌ణం కోలాహ‌లంగా మారుతుంది. జంతు బ‌లుల‌ నైవేద్యాల‌ను స‌మ‌ర్పించ‌డం మేడారంలో ఆచారం. కానీ, ఆ వ్య‌ర్థాల‌ను పారిశుధ్య కార్మికులు స‌రిగ్గా తొల‌గించ‌క‌పోవ‌డంతో అక్క‌డ‌క్క‌డా భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.

ఇక్క‌డే ములుగు ఎమ్మెల్యే సీత‌క్క చొరవ తీసుకున్నారు. ఈ ప్రాంతం సీత‌క్క ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో భాగం. భ‌క్తుల‌కు ఇబ్బందులు రాకుండా రెండు రోజుల నుంచి పారిశుధ్య కార్మికురాలిగా మారారు. అట‌వీ ప్రాంతంలో భ‌క్తులు ప‌డేసిన మేక‌లు, గొర్రెల చ‌ర్మాలు, ఇత‌ర క‌ళేబ‌రాల‌ను స్వ‌యంగా ఏరివేశారు. భ‌క్తులు విడిది చేసిన ప్రాంతాల్లో వ్య‌ర్థాల‌ను తొల‌గించారు.

ప్ర‌భుత్వం పారిశుధ్య ప‌నుల‌ను రోడ్డు వెంట మాత్ర‌మే చేయిస్తోంద‌ని.. అట‌వీ ప్రాంతాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సీత‌క్క ఆరోపించారు. వ్య‌ర్థాల‌తో దోమ‌లు, ఈగ‌లు, బ్యాక్టీరియా వ్యాప్తి చెంది డెంగీ, మ‌లేరియా వంటి వ్యాధులు వ‌స్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క్రితం సారి జాత‌ర త‌ర్వాత చుట్టుప‌క్క‌ల ప‌ది గ్రామాల ప్ర‌జ‌ల్లో ఇంటికొక‌రు చొప్పున అనారోగ్యానికి గుర‌య్యార‌ని గుర్తు చేశారు.

దీంతో సీత‌క్క చ‌ర్య‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయిని ప‌క్క‌న పెట్టి పారిశుధ్య కార్మికురాలిగా మారి ప్ర‌జ‌ల సేవ‌లో త‌రిస్తున్నార‌ని మెచ్చుకుంటున్నారు. క‌రోనా, లాక్‌డౌన్ కాలంలో కూడా గిరిజ‌న ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని సీత‌క్క స్వ‌యంగా కొండ‌లు, వాగులు దాటుకొని వెళ్లి స‌రుకులు, మందులు అంద‌జేశారు. ఇదంతా ఎన్నిక‌ల స్టంట్ గా టీఆర్ఎస్ చెబుతున్న‌ప్ప‌టికీ నెటిజ‌న్లు కొట్టిపారేస్తున్నారు. అన్ని చోట్లా ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.