ఆ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు

భారత బ్యాడ్మింటన్ భాగ్య రేఖను మార్చేసిన వ్యక్తి పుల్లెల గోపీచంద్. ఆటగాడిగా ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలవడం ద్వారా అందరి దృష్టిలో పడ్డ గోపీచంద్.. కోచ్‌గామారాక సాధించిన ఘనతలు అసామాన్యమైనవి. తన పేరిట అకాడమీ పెట్టి సైనా, సింధు, శ్రీకాంత్ సహా ఎందరో బ్యాడ్మింటన్ స్టార్లను వెలుగులోకి తెచ్చి ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం. ఇంకా ఆయన జీవితంలో అనేక కోణాలున్నాయి. వీటన్నింటినీ తెరమీదికి తేవాలన్న ప్రయత్నం కొన్నేళ్ల కిందట మొదలైంది.

గోపీచంద్ స్నేహితుడు, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన హీరో సుధీర్ బాబు ప్రధానపాత్రలో ఈ సినిమా తీయడానికి సన్నాహాలు జరిగాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలనుకుంది. కొన్నేళ్ల పాటు పూర్వ నిర్మాణ పనులు జరిగాయి. కానీ ఎంతకీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. కొంత కాలంగా దీని గురించి వార్తలే లేకపోవడం.. సుధీర్, ప్రవీణ్ వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోవడంతో గోపీచంద్ బయోపిక్ అటకెక్కేసినట్లే అనుకున్నారు.

ఐతే ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని, తన కెరీర్లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నాడు సుధీర్ బాబు. కొన్ని కారణాల వల్ల ముందు ఈ సినిమాను టేకప్ చేసిన సంస్థ దీన్నుంచి తప్పుకుందని.. ఐతే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని సుధీర్ తెలిపాడు.

ఐతే దర్శకుడిగా ప్రవీణే ఉంటాడా.. ఆ స్థానంలోకి కూడా వేరొకరు వచ్చారా అన్నది సుధీర్ బాబు చెప్పలేదు. గోపీచంద్ బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో కూడా సుధీర్ వెల్లడించలేదు. కాగా ‘లూజర్’ వెబ్ సిరీస్ తీసిన అభిలాష్ రెడ్డితో తాను ఒక సినిమా చేయబోతున్నానని.. అలాగే యాక్షన్ జానర్లో బెంచ్ మార్క్‌లా నిలిచిపోయే సినిమా కూడా ఒకటి చేయనున్నానని.. ఇంకో రెండు కథలు కూడా ఓకే చేశానని సుధీర్ బాబు తెలిపాడు. యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మధ్యలో ఉన్నట్లు సుధీర్ వెల్లడించాడు.