AP: కాదేదీ తాక‌ట్టుకు అన‌ర్హం

ప్ర‌భుత్వం స్థ‌లం ఖాళీగా ఉందా? ఆక‌ట్టుకునే పార్కులు ఉన్నాయా? ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే బ్యాంకుల‌కు తాక‌ట్టు పెట్టి రుణం పొందాల్సిందే.. ఇదీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార వైసీపీ ప్ర‌భుత్వ తీరు అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రిన్ని రుణాల కోసం ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను, ఆస్తుల‌ను తాక‌ట్టు పెడుతుంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. కాదేదీ తాక‌ట్టుకు అన‌ర్హం అనేలా జ‌గ‌న్ ముందుకు సాగుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

భ‌వ‌నాలు, స్థలాలు అయిపోవ‌డంతో ఇక ప్ర‌భుత్వం పార్కుల తాక‌ట్టు మొద‌లెట్టింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విజ‌య‌వాడ‌లో కృష్ణా న‌ది ఒడ్డున ఉన్న అత్యంత విలువైన బెర్మ్ పార్కును ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తాక‌ట్టు పెట్టింది. వివిధ అభివృద్ధి ప‌నుల కోసం రూ.143 కోట్ల అప్పు కోసం ఆ పార్కును ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు త‌న‌ఖా పెట్టింది.  ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డంతో తొలి విడ‌త‌గా నాలుగైదు రోజుల్లో రూ.35 కోట్లను బ్యాంకు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నిధులు ఉంటేనేమో వాటితోనే అభివృద్ధి చేసేది. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి అప్పులు తీసుకుని మ‌రీ ప‌నులు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

అందుకు వ్యాపారం బాగా న‌డుస్తున్న‌, ఆస్తి పరంగా ఎంతో విలువైన బెర్మ్ పార్కును తాక‌ట్టు పెట్టింది. ఈ రుణంతో పెండింగ్‌లో ఉన్న ప‌నులు పూర్తి చేయ‌డంతో పాటు హోట‌ళ్లు, రిసార్టుల‌ను ఆధునీక‌క‌రిస్తామ‌ని ఏపీటీడీసీ తెలిపింది. మ‌రోవైపు ఇటీవ‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిలోని వివిధ గ్రామాల ప‌రిధిలో ఉన్న సుమారు 480 ఎక‌రాల‌ను సీఆర్‌డీఏ రుణం కోసం బ్యాంకుల‌కు తాక‌ట్లు పెట్టిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెన్‌డౌన్ చేసిన‌ప్ప‌టికీ మండ‌లంలోని స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యంలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసిన‌ట్లు తెలిసింది. అనంత‌వ‌రం, మంద‌డం, ఉద్ధండ‌రాయునిపాలెం, లింగాయ‌పాలెం, వెంక‌ట‌పాలెం గ్రామాల ప‌రిధిలో రైతులు భూస‌మీక‌ర‌ణ‌లో ఇచ్చిన భూమిలో సీఆర్‌డీఏ వాటాకు వ‌చ్చిన స్థ‌లాన్ని కొంత బ్యాంకుల‌కు త‌న‌ఖా పెట్టిన‌ట్లు తెలిసింది. రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఈ భూమిని తాక‌ట్లు పెట్టింద‌ని స‌మాచారం.