అసలు విషయం చెప్పేసిన తలసాని

అవును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ఉద్దేశ్యపూర్వకంగానే కేసీయార్ స్వాగతం పలకలేదు అయితే ఏమిటి ? అంటూ డైరెక్టుగానే మంత్రి తలసాని ప్రశ్నించారు.  ప్రధాని-కేసీయార్ వివాదంలో ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో. అందుకనే మీడియా సమావేశంలో బహిరంగంగానే కేసీయార్ ఉద్దేశ్యాన్ని చెప్పేశారు. తెలంగాణాకు నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్న అన్యాయానికి నిరసనగానే ప్రధానమంత్రికి కేసీయార్ స్వాగతం పలకలేదని తలసాని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు.

ప్రధానికి స్వాగతం పలకటానికి కేసీయార్ రాకపోవటంపై  బీజేపీ నేతలు నానా రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న 5వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన నరేంద్ర మోడీకి స్వాగతం పలకటానికి కేసీయార్ రాలేదు. ఇదే విషయం రాజకీయంగా టీఆర్ఎస్-బీజేపీ మధ్య మంటలు మండిస్తోంది. నిజానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినపుడు ముఖ్యమంత్రి కచ్చితంగా స్వాగతం చెప్పి తీరాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి కార్యక్రమంలో కచ్చితంగా ఉండాల్సింది చీఫ్ సెక్రటరీ, డీజీపీ మాత్రమేనట. గవర్నర్, సీఎం, మంత్రులంతా ఇష్టముంటే హాజరవుతారు లేకపోతే లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాకపోతే ప్రధానమంత్రి వచ్చినపుడు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరవ్వటం అన్నది గౌరవమే కానీ ప్రోటోకాల్ కాదట. ఇంటికి అతిథి వచ్చినపుడు ఇంటి పెద్ద ఎలా రిసీవ్ చేసుకుంటారో అలాగే ప్రధానమంత్రి వచ్చినపుడు సీఎం రిసీవ్ చేసుకోవటం సంప్రదాయమే గానీ ప్రోటోకాల్ కాదని అధికారులు చెబుతున్నారు.

గవర్నర్ ఎందుకు రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళ నియామకం ప్రధానమంత్రి చేతిలోనే ఉంటుంది కాబట్టే. గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి అయినా సిఫారసులు చేసేది మాత్రం ప్రధానమంత్రే. అందుకనే ప్రధాని వచ్చినపుడు కచ్చితంగా గవర్నర్లు కూడా ఉంటారు. ప్రధాని కార్యక్రమాలకు కేసీయార్ కావాలనే డుమ్మా కొట్టినట్లు తలసాని ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. 

కేసీయార్ కు జ్వరమని చెప్పిందంతా కేవలం సాకు మాత్రమే అని తేలిపోయింది. కేసీయార్ డుమ్మా కొట్టినందుకు ఏమి చేసుకుంటారో చేసుకోండని తలసాని సవాలు విసిరినట్లే ఉంది. మరి కమలనాథులు ఏమి చేస్తారో చూడాలి.