తెలంగాణ‌లోనూ ఇక గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం!

తెలంగాణ రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల మూడ్ కనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ దూరంగా ఉండ‌డంతో వార్ మ‌రింత ముదిరింది. మోడీతో యుద్దానికి దిగాన‌న్న సంకేతాల‌ను కేసీఆర్ పంపించారు. మోడీ రాష్ట్రానికి వ‌స్తే క‌నీసం ఆయ‌న వైపు క‌న్నెత్తి కూడా చూడ‌కుండా క‌మ‌లం పార్టీతో క‌య్యానికి తాను సిద్ధ‌మ‌య్యాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జ్వ‌రం సాకుతో ఆయ‌న త‌ప్పించుకున్నార‌ని, మోడీని అవ‌మానించార‌ని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రిన్ని మ‌లుపులు తీసుకోబోతున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కేసీఆర్ స‌మ‌రానికి సై అన‌డంతో బీజేపీ కూడా త‌గ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌నుంది. గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్టున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్ వెళ్ల‌లేదు. దీంతో దూరం మ‌రింత పెరిగింది.

మ‌రోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న ప్ర‌భుత్వాల‌పై గ‌వ‌ర్న‌ర్‌ను ప్రయోగించ‌డం బీజేపీకి అల‌వాటుగా మారింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. గ‌తేడాది ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌కు ముందు గ‌వ‌ర్న‌ర్‌తో మమ‌తా బెన‌ర్జీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ‌మ‌త వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్‌గా ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. ఇక ఢిల్లీ, పుదుచ్చేరిలోనూ ముఖ్య‌మంత్రుల‌ను ఇబ్బంది పెట్టేలా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్లు గ‌తంలో వ్య‌వ‌హ‌రించారు.  ఇప్పుడు త‌మిళ‌నాడులోనూ గ‌వ‌ర్న‌ర్‌తో స్టాలిన్ ఇబ్బంది ప‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తెలంగాణ‌లోనూ బీజేపీ అదే ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌బోతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఇక్క‌డ కీల‌క భూమిక పోషించే అవ‌కాశాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వ‌చ్చే రోజుల్లో ప్ర‌భుత్వ విధానాల‌పై నిర్ణ‌యాల‌పై ఆమె వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్ర‌తిపాదిస్తూ కేసీఆర్ మంత్రివ‌ర్గం చేసిన ప్ర‌తిపాద‌న‌ను తమిళి సై అమోదించ‌లేరు. దీంతో ఆయ‌న్ని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఇటీవ‌ల ఎంపీ అర‌వింద్ దాడిపైనా గ‌వ‌ర్న‌ర్ ఆరా తీశారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ కేసీఆర్‌గా ప‌రిస్థితి మారేలా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.