లెంప‌లేసుకున్న ట్విట్ట‌ర్‌

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఈ వ్యాఖ్య‌ల‌ను తొల‌గించేందుకు సాధ్య‌ప‌డ‌ద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పుకొచ్చిన సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ దిగి వ‌చ్చింది. త‌ప్పేన‌ని ఒప్పుకొంది. లెంప‌లు కూడా వేసుకుంది. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటా మ‌ని.. ఇక‌పై పోస్టులు క‌నిపించ‌డం కుండా చూస్తామ‌ని పేర్కొంది. జడ్జిలపై వ్యాఖ్యలు ఇక నుంచి కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టుకు హామీ ఇచ్చారు. అఫిడవిట్‌లో పూర్తి వివరాలు తెలిపామని కోర్టుకు తెలిపారు. అఫిడవిట్‌లో చెప్పినవి నిజమో కాదో చూడాలని న్యాయస్థానం.. సీబీఐని ఆదేశించింది. మెమో దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

గత విచారణ సందర్భంగా సామాజిక మాధ్యమాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించే వ్యవహారంలో సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయస్థానంతో దోబూచులాడుతు న్నాయని ఆక్షేపించింది. అభ్యంతరకర యూఆర్ఎల్ లను(యూనిఫాం రిసోర్స్ లొకేటర్) తొలగించాలని సీబీఐ కోరితే 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాద్యమ కంపెనీలపై మండిపడింది.

గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నాయని, సరైన స్పూర్తితో అమలు చేయడం లేదని ఆక్షేపించింది. ఫలానా పోస్టులు తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జన రల్(ఆర్బీ) లేదా కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోరితే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని యూఆర్ఎల్స్ ను తొలగించలేదని సీబీఐ, తొలగించామని సామాజిక మాధ్యమ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో.. ఇరువురిలో ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.

కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్ని యూఆర్ఎల్స్‌ను తొలగించాలని కోరారో ఆ వివరాలను సామాజిక మాధ్యమాలకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఎన్ని తొలగించారు..? మిగిలినవి తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్లను ఆదేశించింది. దీంతో తాజాగా ట్విట్ట‌ర్ స్పందించింది.