అన్ని పార్టీల‌తో క‌లిసి జ‌గ‌న్‌పై పోరు!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై పోరాటానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో మార్గం ఎంచుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి పార్టీకి త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండేలా చూసుకోవాల‌నుకుంటున్న బాబు.. అందుకోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు స‌రికొత్త ఆలోచ‌న చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉద్యోగ సంఘాల ఉద్య‌మం త‌ర్వాత బాబు ఆలోచ‌న‌లో మార్పు వ‌చ్చింద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

అంద‌రితో క‌లిసి..
కొత్త‌గా ప్ర‌క‌టించిన పీఆర్సీ జీవోల‌ను ర‌ద్దు చేయాల‌ని పాత పీఆర్సీ ప్ర‌కార‌మే జీతాలు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయింది. జ‌గ‌న్ ఊహించ‌ని రీతిలో ఉద్యోగులు బెజ‌వాడ చేరుకుని ప్ర‌భుత్వానికి షాకిచ్చారు. దీంతో పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌ల‌తో చర్చ‌లు జ‌రిపిన ప్ర‌భుత్వం కాస్త వెన‌క్కిత‌గ్గింది. దీంతో ఉద్యోగ సంఘాల నేత‌లు స‌మ్మె విర‌మించారు. వాళ్ల ఉద్య‌మానికి ప్ర‌జ‌లు కూడా అండ‌గా నిలిచార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇదే త‌ర‌హాలో చంద్ర‌బాబు ఉద్య‌మాలు చేయాల‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు విప‌క్షంలోని అన్ని పార్టీల‌తో క‌లిపి అఖిల ప‌క్షం ఏర్పాటు చేయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ప్ర‌భుత్వ విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో ఉమ్మ‌డి కార్య‌చ‌ర‌ణ రూపొందించాల‌ని నిర్ణయించారు.

పొత్తు మాట‌లేకుండా..
ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఆ లోపు పార్టీని బ‌లోపేతం చేసుకుని ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని బాబు చూస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు తిరిగి కూడ‌గ‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అఖిల ప‌క్షంగా అన్ని పార్టీల‌కు క‌లుపుకొని ఆందోళ‌న‌లు చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటుకు ఆయ‌న సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల్లో పొత్తులు కాకుండా.. ఎన్నిక‌ల కూట‌మి కాక‌పోయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వ విధానాల‌పై ఉద్య‌మాల కోసం మాత్రం అన్ని పార్టీల‌ను క‌లుపుకోవాల‌ని చూస్తున్నార‌ని తెలిసింది.

అధికార పార్టీ మిన‌హా అన్ని పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను స‌మాయ‌త్తం చేసి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు చేయాల‌న్న‌ది బాబు ప్లాన్‌. కానీ ఆయ‌న‌తో ఏ పార్టీలు క‌లిసి వ‌స్తాయ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇప్ప‌టికే బాబుతో క‌లిసేదే లేద‌ని బీజేపీ చెబుతోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వంపై పోరాటం అంటే జ‌న‌సేన ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక అంతంత‌మాత్రంగానే ఉన్న కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు బాబుకు తోడుగా నిలిచే వీలుంది. బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వ‌స్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ల‌తో మంత‌నాలు జ‌రిపే బాధ్య‌త‌ను సీనియ‌ర్ నాయ‌కుల‌కు బాబు అప్ప‌గించిన‌ట్లు తెలిసింది.