పీఆర్సీ మంటలు ఇంకా చల్లారలేదా ?

పీఆర్సీ మంటలు ఇంకా చల్లారినట్లు లేదు. శనివారం రాత్రి పీఆర్సీ వివాదంపై మంత్రుల కమిటితో పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చించారు. తర్వాత ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది కాబట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్వహించాలని అనుకున్న సమ్మెను విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. అయితే ఆదివారం మధ్యాహ్నం నుండి కొన్ని నిరసన గళాలు బయటపడుతున్నాయి.

పీఆర్సీ సాధన సమితి నేతలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, కాంట్రాక్టు ఉద్యోగులు మండిపోతున్నారు. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి నేతలు కుదుర్చుకున్న ఒప్పందం చీకటి ఒప్పందాలంటు మండిపడుతున్నారు. మంత్రుల కమిటీ ఉద్యోగుల నేతలకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని తాము ఆమోదించేది లేదన్నట్లుగా ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు.

ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం 23 శాతం కన్నా పెంచనపుడు పీఆర్సీ సాధన సమితి నేతలు సమ్మెను విరమిస్తున్నట్లు ఎలా ఒప్పందం చేసుకుంటారంటు నిలదీస్తున్నారు. ఇదే విషయమై సోమవారం జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలుపుతామంటు కాంట్రాక్టు ఉద్యోగులు పిలుపునివ్వటం గమనార్హం. టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహారం చూస్తుంటే పీఆర్సీ సాధన సమితి నేతలతో సంబంధం లేనట్లుగానే మాట్లాడుతున్నారు.

తాజా పరిణామాలు చూస్తుంటే 27 శాతం ఫిట్మెంట్, సీపీఎస్ రద్దు డిమాండ్ తో ఉపాధ్యాయ సంఘాలు  ఆందోళనను వారం రోజులు కంటిన్యూ చేయబోతున్నారు. దీంతో సమ్మె పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది.  అలాగే ఉద్యోగ నేతలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేటపుడు తమను మరచిపోవటం దారుణమంటు కాంట్రాక్టు ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. సో క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే పీఆర్సీ మంటలు ఇంకా పూర్తిగా చల్లారలేదని అర్ధమవుతోంది.

నల్ల బ్యాడ్జీలతో వారం రోజుల పాటు నిరసన తెలియజేస్తునే విధులకు హాజరు కావాలని ఉపాధ్యాయ సంఘాలు డిసైడ్ చేశాయి. 11వ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తారు. 12వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఈ కార్యక్రమాలకు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే హాజరవుతారా లేకపోతే కాంట్రాక్టు ఉద్యోగులను కూడా కలుపుకుంటారా అన్న విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి ప్రభుత్వం దీన్ని ఎలా టాకిల్ చేస్తుందో చూడాల్సిందే.