కేసీఆర్ యూ ట‌ర్న్‌… మోడీ సారుకు వెల్‌కం చెప్తార‌ట‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన ఈ గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. రెండు కీల‌కమైన కార్య‌క్ర‌మాల‌తో ప్రధాని నరేంద్రమోడీ నేడు హైదరాబాద్ వస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమం, శంషాబాద్ ముచ్చింత్‌లోని రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం మ‌రియు జాతికి అంకితం చేసే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు.

అయితే, ప్ర‌ధాని మోడీ టూర్లో పాల్గొన‌కూడ‌ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ టూర్ సంద‌ర్భంగా ఆహ్వానం ప‌లికే కార్య‌క్ర‌మంలో మ‌రియు వీడ్కోలు చెప్పేట‌ప్పుడు పాల్గొన‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ ఎపిసోడ్ విష‌యంలో సీఎం కేసీఆర్ యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. పీఎం మోడీ టూర్లో ఆయ‌న వెంట ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మోడీతో పాటు సీఎం కేసీఆర్ కూడా ఛాపర్లో ఇక్రిశాట్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.  ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో 7 నిమిషాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ప్రధానితో పాటు ముచ్చింతల్ కు వెళ్తారు. రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 8.15 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ప్రధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు కేసీఆర్ ఆయన వెంటే ఉంటారు. ప్ర‌ధానికి స్వాగ‌తం, వీడ్కోలు ప‌లికే కార్య‌క్ర‌మంలో ఆయ‌న వెట ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.