ఏపీ డీజీపీ మార్పు..? హాట్ టాపిక్‌!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్‌పై చ‌ర్చ సాగుతోంది. రాష్ట్ర డీజీపీగా గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తున్న(2019లో జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చిన తొలి వారంలోనే గౌతంస‌వాంగ్‌ను డీజీపీ చేశారు) గౌతం స‌వాంగ్‌ను ఇక‌, ఆ ప‌ద‌వి నుంచి ప‌క్క‌న పెడ‌తారా?  లేక‌.. ఇప్ప‌టికి జ‌రిగిందే జ‌రిగింద‌ని.. మున్ముందు జాగ్ర‌త్త‌గా ఉండ‌ద‌ని.. క్లాస్ ఇచ్చి ఊరుకుంటారా? అనే అంశంపై వైసీపీ నాయ‌కుల మ‌ధ్య జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. దీనికి కార‌ణం. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ.. సీఎం జ‌గ‌న్‌.. డీజీపీని స్వ‌యంగా త‌న కార్యాయాల‌నికి ఒంట‌రిగా పిలిపించుకుని మాట్లాడింది లేదు. ఏదైనా ఉంటే.. మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌కు ముందు.. భేటీ అయి.. ఆయా అంశాల‌పై చ‌ర్చించేవారు.

కానీ, తాజాగా ఉద్యోగుల `చలో విజయవాడ` పరిణామాల దృష్ట్యా.. ముఖ్యమంత్రి జగన్‌.. డీజీపీ సవాంగ్‌ను స్వ‌యంగా త‌న కార్యాల‌యానికి పిలిపించుకుని భేటీ అయ్యారు. సుమారు అర గంట పాటు జరిగిన భేటీ(క్లాస్ పీకార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది)లో… ఛలో విజయవాడ అంశంపైనే ఎక్కువ‌గా చర్చ జరిగినట్లు తెలిసింది. పోలీసులు భారీ సంఖ్య‌లో మోహ‌రించినా.. ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని సీఎం నిల‌దీసిన‌ట్టు తెలిసింది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై మ‌రింత సీరియ‌స్ అయ్యార‌ని, దీనిపై వ‌చ్చిన వార్త‌ల‌ను స్వ‌యంగా సీఎం.. డీజీపీకి చూపించి మ‌రీ చర్చించినట్లు సమాచారం.

చ‌లో విజ‌య‌వాడ‌కు ఉద్యోగులు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో ఆది నుంచి ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది. దీనిని నిలువ‌రించేలా పోలీసుల‌కు స‌ర్వాధికారాలు ఇచ్చింది. దీంతో విజయవాడకు చాలా తక్కువ మంది వస్తారని పోలీసులు అంచనా వేసినా… అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగులతో నిండిపోయింది. ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయనే అంశంపైనా డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.

అందువల్ల ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా చర్చించినట్లు తెలిసింది. చలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను సీఎంకు డీజీపీ సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం లాంటివి జరిగాయని తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే.. వైసీపీ వ‌ర్గాలు మాత్రం డీజీపీని మారుస్తార‌నే కోణంలో చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు కాకుండా.. త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యం ఉంటుంద‌ని అంటున్నారు.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.