కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న జ‌గ‌న్ టీం

తెల‌గు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య‌నున్న రాజ‌కీయ దోస్తీ ప్రస్తుత ప‌రిస్థితిపై ఎవ్వ‌రూ ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ఐక్యంగా సాగిన ఈ ఇద్ద‌రు సీఎంల మైత్రిలో ఈ మ‌ధ్య వివిధ అంశాల మ‌ధ్య కార‌ణంగా ఒకింత గ్యాప్ ఏర్ప‌డింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెప్తుంటారు. మ‌రోవైపు అలా ఏం లేదు… ఇద్దరి మ‌ధ్య సఖ్య‌త స‌రిగానే ఉంద‌ని ఇంకొంద‌రు చెప్తుంటారు.

అయితే, చెప్పుకోద‌గ్గ స్థాయిలో విబేధాలు బ‌య‌ట‌ప‌డిన ప‌రిస్థితి అయితే లేద‌న్న‌ది నిజం. కాగా, ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డేందుకు మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పద‌మైన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌కు చెందిన నేత‌లు దీనిపై త‌మ‌దైన శైలిలో స్పందించారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున కూడా ప‌లువురు నేత‌లు రియాక్ట‌య్యారు. అయితే, అధికార వైసీపీ త‌ర‌ఫున రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ కామెంట్ల విష‌యంలో ఎవ‌రూ స్పందించ‌లేదు. అయితే, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏపీకి చెందిన‌ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. రాజ్యాంగం మార్చాలని కొంత మంది కుహనా మేధావులు  అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయ‌ని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్ల‌ను అంతలా కలచివేచేలా చేస్తోందో? అని అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారు? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి విష‌యాల్లో రాజ్యాంగాన్ని మార్చాల‌నే వారు ఎందుకు స్పందించ‌రు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ మంత్రి టార్గెట్ చేశారు.