NTR30: అలియా ఏం చెప్పిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా ‘అరవింద సమేత’ రిలీజైంది 2018లో. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’లో మునిగిపోవడంతో ఇప్పటిదాకా మరో సినిమా రిలీజ్ లేదు. మామూలుగానే రాజమౌళి సినిమాల మేకింగ్ ఆలస్యమవుతుంటుంది. దీనికి తోడు కరోనా కూడా అడ్డు పడటంతో సినిమా ఆలస్యమైంది. విడుదల కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మార్చి 25కు రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు కొన్ని రోజులు ప్రమోషన్లలో పాల్గొనడం మినహా తారక్‌కు పనేమీ లేదు. దీంతో గత ఏడాది కమిటైన కొరటాల శివ సినిమాను ఎట్టకేలకు సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నాడు. ఈ నెల ఏడో తారీఖున ఈ చిత్రానికి ముహూర్త కార్యక్రమం నిర్వహించనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్, కథానాయికగా ఆలియా భట్ ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఓకే అన్నది చాన్నాళ్ల ముందే ఖరారైన వార్తే. ఇందులో మార్పేమీ ఉండకపోవచ్చు. కానీ కథానాయికగా ఆలియా నటిస్తుందా అన్న విషయంలో జనాల్లో సందేహాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికే అతి కష్టం మీద ఒప్పుకున్న ఆలియాకు.. హిందీలో భారీ చిత్రాల కమిట్మెంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తారక్-కొరటాల సినిమాకు నిజంగానే ఆమె ఓకే చెప్పిందా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఈ అనుమానాలకు ఆమె తెరదించేసింది.

తన కొత్త చిత్రం ‘గంగూబాయి: కథియావాడీ’ ప్రమోషన్లలో భాగంగా తారక్ సినిమా గురించి అడిగితే.. ఔను నిజమే, నేనా సినిమా చేస్తున్నా అని ముంబయిలో మీడియాతో వ్యాఖ్యానించింది ఆలియా. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కూడా ఆమె చెప్పింది. కొరటాల దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచార్య’ సినిమా బాగా ఆడాలని కూడా ఆమె కోరుకోవడం విశేషం. కాబట్టి తారక్-ఆలియా జంటను నిజంగానే తెరమీద చూడబోతుండటం నిజమే అన్నమాట. ఈ చిత్రాన్ని తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్, కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు.