పుష్ప స్టయిల్లో స్మగ్లింగ్ చేస్తూ..

యువత మీద చెడు ప్రభావం చూపేలా ఉందంటూ ‘పుష్ప’ సినిమా మీద పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విరుచుకుపడ్డ సమయంలోనే.. ఆ సినిమా స్ఫూర్తితో భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ప్రయత్నించిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోవడం సంచలనం రేపుతోంది. ‘పుష్ప’ సినిమాలో పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం తరలించడానికి హీరో రకరకాల మార్గాలు కనుక్కొంటాడన్న సంగతి తెలిసిందే.

పాల వ్యానులో సగం వరకు ఎర్రచందనం దుంగల్ని పెట్టి.. వెల్డింగ్ చేసి, దానిపైన పాలు పోయడం.. పెళ్లికి జనాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్లో కింద దుంగలు పరిచడం.. అంబులెన్సుల్లో చందనం దుంగలు పెట్టడం.. ఇలా రకరకాల మార్గాల్లో హీరో చందనం స్మగ్లింగ్ చేస్తాడు. ఇవన్నీ చూసి స్ఫూర్తి పొంది సినీ ఫక్కీలో కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని తరలిస్తున్న యాసిన్ ఇనాయతుల్లా అనే స్మగ్లర్ మహారాష్ట్రాలో పోలీసులకు దొరికిపోయాడు.

ఎర్రచందనం దుంగల్ని ఒక ట్రక్కులో కింద పరిచేసి.. వాటి మీద కూరగాయలు, పళ్లు పెట్టి కర్ణాటక బార్డర్ దాటించిన ఇనాయతుల్లా మహారాష్ట్రాలో పోలీసుల తనిఖీ సందర్భంగా దొరికిపోయాడు. అతను రవాణా చేస్తున్న దుంగల విలువ రూ.2.45 కోట్లు కావడం గమనార్హం. పోలీసుల కళ్లు గప్పాడో.. వాళ్లకు లంచాలిచ్చి బయటపడ్డాడో కానీ.. కొన్ని వందల కిలోమీటర్లు సాఫీగానే ఆ స్మగ్లర్ ప్రయాణం సాగిపోయింది.

కానీ మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఇనాయతుల్లాను విడిచిపెట్టలేదు. ‘పుష్ప’ సినిమా స్ఫూర్తితోనే ఇలా చేసినట్లు సదరు స్మగ్లర్ పోలీసులకు చెప్పాడట. సంబంధింత ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కనుక చూస్తే గరికపాటి నరసింహారావు మరింతగా ‘పుష్ప’ సినిమా మీద ఫైర్ అవుతారేమో.