బుచ్చిబాబు కోసం ఎన్టీఆర్ త్యాగం

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది ఏది అంటే మరో మాట లేకుండా ప్రశాంత్ నీల్‌తో అతను చేయాల్సిన చిత్రమే అనేస్తారు అభిమానులు. ‘కేజీఎఫ్’ రిలీజైనప్పటి నుంచి సౌత్ ఇండియాలో ప్రతి స్టార్ హీరోకూ ప్రశాంత్‌తో సినిమా చేయాలని ఉంది. అందులో ఎన్టీఆర్ కూడా ఒకడు.

వీరి కలయికలో సినిమా ఓకే అయిన దగ్గర్నుంచి అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నిజానికి ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. కానీ మధ్యలో ప్రశాంత ‘సలార్’ ఒప్పుకోవడం.. తారక్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యం కావడంతో ఈ కలయిక లేటైంది. ఐతే తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.

ప్రశాంత్ ‘సలార్’ పనిలో బిజీగా ఉన్నాడు. తారక్, ప్రశాంత్ ఈ రెండు చిత్రాలను పూర్తి చేశాక జట్టు కడతారని అభిమానులు అనుకుంటున్నారు.కానీ ప్రశాంత్‌తో తారక్ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. కొరటాల సినిమా అయ్యాక కూడా తారక్ ప్రశాంత్ చిత్రాన్ని మొదలుపెట్టే సూచనలు కనిపించడం లేదు. ఈలోపు అతను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సినిమానే సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నాడు. ‘ఉప్పెన’ రిలీజై ఆల్రెడీ ఏడాది దాటిపోయింది. దీని తర్వాత ఎన్టీఆర్ మీదే అతను ఆశలు పెట్టుకున్నాడు.

తన కోసం ఎక్కువ కాలం వేచి చూసేలా చేయడం ఇష్టం లేక తారక్.. ప్రశాంత్ సినిమాను వెనక్కి జరిపి బుచ్చిబాబు చిత్రాన్ని ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌తో సినిమా చేయాలని తారక్ కూడా తహతహలాడుతున్నప్పటికీ.. బుచ్చిబాబు కోసం త్యాగం చేస్తున్నాడట. అతడితో తారక్‌కు మంచి స్నేహం ఉంది. అందుకే ప్రశాంత్ సినిమాను వెనక్కి జరిపి దీన్ని ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కూడా పరిస్థితి అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. ‘సలార్’ను రెండు భాగాలుగా తీయడానికి ఆలస్యమయ్యేలా ఉండటంతో దీనికి అతను కూడా ఓకే చెప్పాడట. కాబట్టి ఈ ఏడాది చివర్లో బుచ్చిబాబు-తారక్ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.