బ‌డ్జెట్‌పై వైసీపీ మౌనం: అంగీక‌రించిన‌ట్టేనా?

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2022-23 వార్షిక బ‌డ్జెట్‌లో ప‌స‌లేద‌ని.. ఎవ‌రికీ ఏమీ లాభం లేద‌ని.. మాట‌ల గార‌డీ త‌ప్ప‌.. కేంద్రం చేసింది క‌నిపించ‌లేద‌ని.. ఈ బ‌డ్జెట్ ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దుమ్మెత్తిపోసింది. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఉపాధులు, ఆరోగ్యం దెబ్బ‌తిన్నాయ‌ని.. వీటిని ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ బ‌డ్జెట్‌ను అధ‌ర్మ బ‌డ్జెట్‌గా, సొల్లు క‌బుర్ల బ‌డ్జెట్‌గా పేర్కొన్నారు. ఇక‌, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు కూడా దుయ్య‌బ‌ట్టాయి. మ‌రి ఇంత జ‌రిగినా.. ఏపీ  అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు మాత్రం క‌క్క‌లేక .. మింగ‌లేక‌.. కుస్తీలు ప‌డుతున్నారు.

మ‌రి దీనిని బ‌ట్టి.. వైసీపీ నేత‌లు ఈ బ‌డ్జెట్‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు అనుకోవాలా?  వైసీపీ నేత‌లు.. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వారాల త‌ర‌బ‌డి ఢిల్లీలో కూర్చుని మాకు అది ఇవ్వండి.. ఇది ఇవ్వండి.. ఆ ప్రాజెక్టు కేటాయించండి.. అని చెప్పినా.. తాజా బ‌డ్జెట్‌లో రూపాయి కూడా విద‌ల్చ‌లేదు. ఇది.. ఏపీకి శ‌రాఘాత‌మేన‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి చేయూత ఇచ్చే దిశ‌గా బ‌డ్జెట్‌లో కేటాయింపులు ప్ర‌త్యేకంగా చేసింది లేద‌ని అంటున్నారు. మ‌రి ఇన్ని వైపుల నుంచి ఇంత‌గా విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. వైసీపీ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.  

ఇక‌, తెలంగాణ సీఎం కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలోనే బ‌డ్జెట్‌పై స్పందించారు. మ‌రి ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా స్పందిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఎన్ని గంట‌లు గ‌డిచినా.. ఆయ‌న స్పందించ‌లేదు. మౌనం అర్ధాంగీకారం.. అన్న‌ట్టుగా. ఆయ‌న బ‌డ్జెట్‌ను స్వాగ‌తిస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఏం చేసినా.. దాదాపు అంగీక‌రిస్తూనే ఉన్నారు. ఐఏఎస్‌ల బ‌దిలీల‌ల‌కు సంబంధించి రాష్ట్రాల హ‌క్కులకు ఎస‌రు పెడుతున్నా.. బాగానే ఉంద‌ని సీఎం లేఖ రాశారు. ఇక‌, పెగాస‌స్‌పై పార్లమెంటులో చ‌ర్చ త‌ప్ప‌ద‌ని ఒక‌వైపు అన్ని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నా.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అస‌లు ఈ అవ‌స‌ర‌మే లేద‌ని.. ఎవ‌రైనా స‌భ‌లో దీనిపై గొడ‌వ చేస్తే.. క‌టిన చ‌ర్య‌లు తీసుకోవాలని అన్నారు. సో.. ఇప్పుడు బ‌డ్జెట్ విష‌యంలో మౌనం పాటించారు.

సాయిరెడ్డి కామెంట్ ఇదే..
కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతోందని  ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలిస్తే కేంద్రం కొంత నిరుత్సాహపరిచే బడ్జెట్ను ప్రవేశ పెట్టిందన్నారు. భూమిలేని రైతులకు అండగా నిలిచేందుకు పథకం తేవాలని సూచించారు. కనీస మద్దతు ధరకు న్యాయపరమైన రక్షణ ఉండాలని అన్నారు. రొయ్యల ఉత్పత్తిపై పన్ను తగ్గింపును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నదుల అనుసంధాన ప్రణాళికను సమర్థిస్తున్నామని.. నదుల అనుసంధానానికి పెట్టిన ఖర్చును రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.