కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు.. చంద్ర‌బాబు

కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ ఆశానకంగా లేదని టీడీపీ అధినేత   చంద్రబాబు పెద‌వి విరాచారు. రైతులకు ఈ బడ్జెట్ ద్వారా ఎటువంటి మేలు జరగదని అన్నారు. పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరం అన్నారు. పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదని చంద్రబాబు అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడాన్ని తప్పు పట్టారు.

సంస్కరణల విషయంలో కేంద్రం తీసుకున్నకొన్ని నిర్ణయాలను చంద్రబాబు స్వాగతించారు. నదుల అనుసంధానం విషయంలో కేంద్ర ప్రతిపాదనలను స్వాగతించారు. తెలుగు దేశం హయాంలో కృష్ణా – గోదావ‌రి నదుల అనుసంధానం చేయడం ద్వారా 7 ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియకు నాంది పలికామని అన్నారు. టీడీపీ హయాంలో కృష్ణా – గోదావ‌రి -పెన్నా నదుల అనుసంధానం పై ప్రణాళికలు కూడా సిద్దం చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా నదుల అనుసంధానంపై కేంద్రం ముందడుగు వెయ్యడాన్ని చంద్రబాబు స్వాగతించారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని చంద్రబాబు ఆహ్వానించారు.

గతంలో దేశంలో మొట్టమొదటి సారిగా ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని తెచ్చామన్నారు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్ర ప్రతిపాదనలు మంచి నిర్ణయాలని చంద్రబాబు అన్నారు. సోలార్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ముందుకు రావడం సముచితం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసిపి ప్రభుత్వం మరో సారి పూర్తిగా విఫలం అయ్యింది అన్నారు. 28 మంది ఎంపిలు ఉండి ఏం సాధించారని అధికార వైసీపీపై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.  

ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా సీఎం జగన్ విఫలం అయ్యారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పటికి కేంద్రం నాలుగు బడ్జెట్ లు ప్రవేశ పెట్టినా.. 28 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏమీ సాధించలేదని అన్నారు. వైసీపీ ఎంపీలకు సొంత ప్రయోజనాలపై తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ద లేదని చంద్రబాబు దుయ్య‌బ‌ట్టారు.