చింతమనేని ఇంట్లో ఉచిత భోజనం !!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై అనేక కేసులు ఉన్నాయి. వీటి లోనూ ప్ర‌ధానంగా ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం14 అట్రాసిటీ కేసులు ఉన్నాయ ని.. ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. అంతేకాదు.. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న ఒక ఎస్సీ కాల‌నీకి వెళ్లి.. “ద‌ళితులు మీకెందుకురా.. రాజ‌కీయాలు` అని కామెంట్ చేసిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌త్య‌ర్థి ప‌క్షం స‌హా మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.

ఈ విష‌యంపై తాజాగా ఆయ‌న ఒక మీడియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌పై ఎస్సీకేసులు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. అయితే.. గ‌తంలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాద‌న్నారు. ద‌ళితుల‌ను తాను ఎప్పుడూ అలా అనలేద‌ని.. శిలాఫ‌ల‌కాల‌ను ధ్వంసం చేసిన‌ప్పుడు.. తాను ద‌ళితుల గ్రామంలోకి వెళ్లాన‌ని… ఈ సంద‌ర్భంగా వారికి.. “శిలా ఫ‌లకాల‌ను ధ్వంసం చేయ‌డం మీకెందుకు.. ఇది రాజ‌కీయాల‌కు సంబందించిన విష‌యం.. మీరు జోక్యం చేసుకోవ‌ద్దు!“ అని హెచ్చ‌రించిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

తాను ద‌ళితుల‌కు కానీ, ఇత‌ర వ‌ర్ణాల‌కు కానీ.. వ్య‌తిరేకం కాద‌ని చింత‌మ‌నేని చెప్పుకొచ్చారు. త‌నఇంట్లో నిత్యం ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం.. భోజ‌నం అంద‌రికీ అందుబాటులో ఉంటుంది.. అన్ని వ‌ర్ణాల‌వారు.. త‌న ఇంటికి ఏదో ఒక ప‌నిపై వ‌స్తుంటార‌ని.. అయితే… ఏ ఒక్క‌రినీ కూడా.. తాను వ్య‌తిరేక భావంతో చూసేది లేద‌ని.. అంద‌రికీ ఒకేవిధ‌మైన టిఫెన్‌, భోజ‌నం పెడ‌తాన‌ని చింత‌మ‌నేని వివ‌రించారు. ఇక‌, త‌మ సొంత గ్రామం దుగ్గిరాల‌లో ద‌ళితుల‌దే ఆధిప‌త్య‌మ‌ని.. 1800 ఓట్లు ఉన్న ఆ గ్రామంలో 1400 ఓట్లు .. ద‌ళితుల‌వేన‌ని.. చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ వారు త‌న తండ్రిని పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గెలిపించార‌ని.. ద‌ళితుల‌తోనే త‌న రాజ‌కీయాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌ని.. చింత‌మ‌నేని వివ‌రించారు. త‌న‌పై చేసిన అనేక దుష్ప్ర‌చారాల్లో ఇది కూడా ఒక‌టేన‌ని అన్నారు.