టీడీపీ ఈ నలుగురునే టార్గెట్ చేస్తోందా ?

జగన్మోహన్ రెడ్డిని బలహీన పరచాలంటే ముందు చుట్టూ ఉన్నవారిని దెబ్బ కొట్టాలి. చుట్టూ ఉన్న వారిలో అత్యంత కీలకమైన వారెవరు ? ఆ నలుగురే  అని బహుశా తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయినట్లుంది. అందుకనే ఎక్కువగా ఈ నలుగురి మీదే బాగా కాన్సంట్రేట్ చేస్తున్నది ప్రధాన ప్రతిపక్షం. ఇంతకీ ఈ నలుగురు ఎవరంటే ముందుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని.

తర్వాత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  మరో ఇద్దరు మంత్రులు.  చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని.  చంద్రబాబుతో పాటు పార్టీ హోలు మొత్తానికి వీరు కంట్లో నలుసుగా తయారయ్యారు.  చంద్రబాబును మంత్రులిద్దరు డ్యామేజి చేసినట్లు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టీని జిల్లాలో ప్రత్యేకించి కుప్పంలో ఓడించటం ద్వారా చంద్రబాబును పెద్దిరెడ్డి మానసికంగా దెబ్బకొట్టారు.  

ఇక కొడాలేమో వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ద్వారా చంద్రబాబును గుక్కతిప్పుకోనీయటం లేదు. కొడాలి ఓవర్ గా మాట్లాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా మంత్రి తన పంథాను మార్చుకోవటం లేదు. దీంతో మంత్రులిద్దరిపైన చంద్రబాబుతో పాటు యావత్ టీడీపీ మండిపోతోంది. వచ్చే ఎన్నికల్లో వీళ్ళని ఓడగొట్టేందుకు శతవిధాల ప్లాన్ చేస్తోంది. ఇక విజయసాయిరెడ్డేమో ఢిల్లీ స్ధాయిలో వైసీపీకి చాలా కీలకంగా ఉంటున్నారు. నరేంద్ర మోడి, అమిత్ షా-జగన్ ప్రభుత్వానికి మధ్య బ్రిడ్జి లాగ వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి కొరకరాని కొయ్యలాగ తయారయ్యారు.  అందుకనే ఈ ఎంపీని కూడా టీడీపీ పదే పదే టార్గెట్ చేస్తోంది.

తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు రూపంలో విజయిసాయిరెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. అలాగే సజ్జలను కూడా టీడీపీ నేతలు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సకల శాఖల మంత్రి అంటూ  పదే పదే టార్గెట్ చేస్తున్నారు. నిజానికి విజయసాయి, సజ్జల ఎన్నికల్లో ఏమీ పోటీచేయబోవటం లేదు. కాబట్టి వీళ్ళని ఎంత టార్గెట్ చేసినా టీడీపీకి ఏమీ ఉపయోగం ఉండదు.  అయినా సరే టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళపై  తమ్ముళ్ళల్లో ఎంతమంటుందో అర్ధమైపోతోంది. సజ్జల పాత్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే అన్ని శాఖల గురించి ఆయనే వివరణ ఇస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు.  చివరకు మంత్రులు పక్కన ఉన్నపుడు కూడా వారి శాఖల గురించి సజ్జల మాట్లాడటం  అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.