త్వ‌ర‌ప‌డుతున్న రాధేశ్యామ్

దేశంలో క‌రోనా మూడో వేవ్ తీవ్ర‌త అనుకున్న స్థాయిలో లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకుంటున్నార‌. కేసులు పెద్ద సంఖ్య‌లోనే న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ.. వైర‌స్ మ‌నుషుల‌పై తీవ్ర ప్ర‌భావం అయితే చూపించ‌ట్లేద‌న్న‌ది స్ప‌ష్టం. ఈ నేప‌థ్యంలో వ్యాపారాల‌కు స‌మ‌స్య లేక‌పోయింది. ప్ర‌స్తుతానికి థియేట‌ర్ల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగానే ఉన్న‌ప్ప‌టికీ.. సుదీర్ఘ కాలం ఆంక్ష‌లు కొన‌సాగేలా లేవు.

మునుప‌టిలా థియేట‌ర్లు మూత‌ప‌డ‌తాయ‌న్న భ‌యం కూడా లేదు. ముఖ్యంగా వేస‌వి సీజ‌న్ వృథా అయిపోతుందేమో అన్న కంగారైతే క‌నిపించ‌డం లేదు ఎవ‌రిలోనూ. వ‌చ్చే నెల చివ‌రిక‌ల్లా థియేట‌ర్లు మునుప‌టిలా న‌డుస్తాయ‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతానికి వాయిదా ప‌డ్డ‌ భారీ చిత్రాలు విడుద‌ల స‌న్నాహాల్లో ప‌డ్డాయి. వాటిలో ముందుగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించే సినిమా రాధేశ్యామ్‌యే కావ‌చ్చ‌ని స‌మాచారం.

ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా నాయ‌క్ రావ‌డం డౌటే కాగా.. ఆర్ఆర్ఆర్ విడుద‌ల ఏప్రిల్లోనే ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నార‌. ఐతే రాధేశ్యామ్ మాత్రం థియేట‌ర్లు పూర్తి స్థాయిలో న‌డ‌వ‌డం మొద‌ల‌వ‌గానే రిలీజ్ అయిపోతుంద‌ట‌. ప్ర‌స్తుతానికి ఈ చిత్రానికి రెండు డేట్లు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. మార్చి 4న లేదంటే 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేయాల‌ని చూస్తున్నారు.

ముందు మార్చి 18వ తేదీకి అనుకున్న‌ప్ప‌టికీ.. దివంగ‌త‌ పునీత్ రాజ్ కుమార్ మూవీ జేమ్స్ ఆ రోజే రిలీజ‌వుతుండ‌టంతో దానికి పోటీగా క‌ర్ణాట‌క‌లో త‌మ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం సాధ్యం కాద‌న్న ఉద్దేశంతో సినిమాను ప్రి పోన్ చేశార‌ట‌. పైగా ప‌రిస్థితులు కూడా అనుకూలంగా మారుతుండ‌టంతో మార్చి తొలి లేదా రెండో వారంలో రాధేశ్యామ్‌ను రిలీజ్ చేయ‌డానికి పెద్ద ఇబ్బంది ఉండ‌ద‌నే భావిస్తున్నారు.