2023లో అధికారంపై రేవంత్‌ ధీమా..!

ఇంత‌కాలం ఓపిక ప‌ట్టారు.. ఇంకో 18 నెల‌లు ఆగండి.. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో.. కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు, బాధ‌లు ప‌ట్ట‌కుండా పాలిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్ర‌భుత్వాల‌ను త‌రిమికొట్టే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ ను జైలుకు పంప‌డం ఖాయం.. అని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. ఆయ‌న వెళ్లిన ప్ర‌తి చోటా ఇదే అంశాన్ని నొక్కి వ‌క్కానిస్తున్నారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని రేవంత్ ఇంత న‌మ్మ‌కంగా చెప్ప‌డానికి కార‌ణ‌మేంట‌ని ఆరా తీస్తే ఆ పార్టీ శ్రేణులు సింపుల్ లాజిక్ చెబుతున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వ‌రుస‌గా రెండు సార్లు అధికారాన్ని చేప‌ట్టాయి. ఈ రెండు ప్ర‌భుత్వాల పాల‌న‌పై ప్ర‌జ‌లు ఇప్ప‌టికే తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇంకో రెండేళ్ల స‌మ‌యం ఉన్నందున వ్య‌తిరేక‌త ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. అపుడు ఆటోమేటిగ్గానే ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయం కోరుకుంటారు. అది కాంగ్రెస్సే క‌నుక త‌మ‌కు ఢోకా ఉండ‌ద‌ని.. త‌మ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ రాజ‌కీయాలు చేస్తున్నా అది ఎక్కువ కాలం ఉండ‌ద‌ని.. బీజేపీ, టీఆర్ ఎస్ క‌లిసిపోయినా ఆశ్చ‌ర్యం చెందాల్సిన ప‌ని లేద‌ని పొలిటిక‌ల్ విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డే అవ‌కాశాలు లేవ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త ఇక్క‌డా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

నిత్యావ‌స‌రాలు, పెట్రో ధ‌ర‌ల పెంపుతో ఇప్ప‌టికే బీజేపీ పై మ‌ధ్య‌త‌ర‌గ‌తి శ్రేణుల్లో కోపం ఉంద‌ని.. కొన్ని వ‌ర్గాలు కూడా ఆ పార్టీని దూరం పెట్టేందుకు సిద్ద‌మ‌య్యాయ‌ని చెబుతున్నాయి. పైగా బీజేపీకి తెలంగాణ‌లో పెద్ద‌గా బ‌లం లేద‌ని.. అది త‌మ‌కు లాభించే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నేత‌ల అభిప్రాయంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీకి స‌రైన నాయ‌క‌త్వం లేద‌ని.. బండి సంజ‌య్ ప్ర‌సంగాల్లో పెద్ద‌గా ప‌స ఉండ‌ద‌ని అంటున్నారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీకి స‌రైన నేత‌లు కూడా లేర‌ని.. ద‌క్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీకి అస‌లు ప‌ట్టే లేద‌ని ఇది కాంగ్రెస్ కే ప్ల‌స్ పాయింట్ గా మారుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రేవంత్ పార్టీ అధ్య‌క్షుడు కూడా కావ‌డం త‌మ‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా మారుతుంద‌ని అంటున్నారు.

అలాగే.. బీజేపీకి కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే స్థాయి నేత‌లే లేర‌ని.. క్రితం సారి ఒకే ఎమ్మెల్యే స్థానం గెలిచింద‌ని.. అదే కాంగ్రెస్ పార్టీకి దాదాపు వంద నియోజకవర్గాల్లో బలమైన నేతలతోపాటు క్యాడర్, ఓటు బ్యాంకు పుష్క‌లంగా ఉందని అంటున్నారు. అలాగే.. న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుంటుంద‌ని.. మిగ‌తా జిల్లాల్లో ఓ మోస్త‌రు స్థానాలు గెలిచినా స‌రిపోతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా  కాంగ్రెస్ కు ఈసారి ఇక్కడి ప్రజలు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నేతల ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయో వేచి చూడాలి.