కథానాయిక ‘కలర్’ కష్టాలు

సినీ రంగంలో కథానాయికగా నిలదొక్కుకోవాలంటే అందం ఫస్ట్ క్వాలిటీ. ఆ అందంలో కూడా ముందుగా చూసేది రంగుని. శరీర సౌష్టవం ఎంత బాగున్నా సరైన రంగు లేకుంటే శీత కన్ను తప్పవు. చాలా కొద్దిమంది మాత్రమే యావరేజ్ కలర్‌తో కథానాయికలుగా రాణించారు. కెరీర్ ఆరంభంలో ఓ మోస్తరు రంగులో ఉన్నప్పటికీ.. తర్వాత స్కిన్ ట్రీట్మెంట్ చేయించునో, ఇంకోటో చేసుకుని రంగు మెరుగుపరుచుకుంటారు.

ఇందుకు ఇలియానా, పూజా హెగ్డే లాంటి వాళ్లు ఉదాహరణ. ఐతే వీరితో పోలిస్తే డింపుల్ హయతి మరింత రంగు తక్కువ. తెలుగులో రవితేజ సరసన ‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమాలో.. అలాగే తమిళంలో విశాల్‌కు జోడీగా ‘వీరమే వాగై సూడుం’ లాంటి క్రేజీ మూవీలో ఆమె కథానాయికగా నటించింది. ఈ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఐతే ఇప్పుడైతే అవకాశాలు బాగానే వస్తున్నాయని.. కానీ కెరీర్ ఆరంభంలో తన రంగు తనకు సమస్యగా మారిందని డింపుల్ వెల్లడించింది.

‘‘నేను కొంచెం తక్కువ రంగున్న అమ్మాయిని. పరిశ్రమలో రంగుకి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ‘గద్దలకొండ గణేష్’లో సూపర్ హిట్టు పాట చేయడానికి ముందు చాలా సినిమా కార్యాలయాలకు వెళ్లాను. ఎన్నిసార్లు నాకు తిరస్కారాలు ఎదురయ్యాయో లెక్క లేదు. నాతో నేరుగా అనేవాళ్లు కాదు కానీ.. నేను వెళ్లిపోయాక నల్లగా ఉన్నానని, ఫెయిర్ స్కిన్ ఉండాలని కామెంట్లు చేసేవారని తెలిసింది. అప్పుడు చాలా బాధ పడేదాన్ని.

నిరాశలో ఉన్న టైంలో ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో పాట చేసే అవకాశం వచ్చింది. ఆ పాట నా కెరీర్‌కు చాలా ప్లస్ అయింది. పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. కానీ ఆ అవకాశాల్లో చాలా వరకు ఐటెం సాంగ్సే. అవే చేసుకుంటూ పోతే ఒక ముద్ర పడిపోతుందని.. నేను కోరుకున్నట్లు కథానాయికగా ఎదగలేనని, హీరోలకు జోడీగా నటించలేనని అర్థమై వాటన్నంటినీ తిరస్కరించా. ఓపిగ్గా ఎదురు చూశాక ‘ఖిలాడి’ సహా మంచి సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది’’ అని డింపుల్ హయతి వివరించింది.