‘టైగర్ నాగేశ్వరావు’ వివాదం.. అసలేం జరిగిందంటే..?

‘టైగర్ నాగేశ్వరావు’ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాను రూపొందించనున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ కథ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ చేయాల్సింది. దర్శకుడు వంశీ స్క్రిప్ట్ పూర్తయ్యాక బెల్లంకొండకి వినిపించారు.

నిర్మాత అభిషేక్.. బెల్లంకొండకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 
అయితే ఈ యంగ్ హీరో మాత్రం వేరే సినిమా కమిట్మెంట్ ఉందని.. ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాను పక్కన పెట్టేశాడు. ఎంతకాలమవుతున్నా.. బెల్లంకొండ రెస్పాండ్ అవకపోవడంతో దర్శకనిర్మాతలు రవితేజకి కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. దీంతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ తను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వమని బెల్లంకొండని అడగ్గా.. ఇప్పుడు సినిమా చేద్దామని అన్నాడట బెల్లంకొండ. 

రవితేజతో సినిమా ఓకే చేసుకున్నామని నిర్మాత చెప్పగా.. బెల్లంకొండ శ్రీనివాస్ హర్ట్ అయ్యాడట. తనతో చేయాల్సిన సినిమా వేరే హీరోతో ఎలా చేస్తారని ప్రశ్నించాడట. అడ్వాన్స్ తిరిగిచ్చేదే లేదని తేల్చి చెప్పాడట బెల్లంకొండ శ్రీనివాస్. కావాలనే సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు బెల్లంకొండ.

అది చూసైనా.. రవితేజ తప్పుకుంటారని ఈ యంగ్ హీరో భావించాడు. కానీ అలా జరగలేదు. దీంతో ఇప్పుడు బెల్లంకొండ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ పెద్ద సెట్ ను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా కావడంతో అప్పటి రోడ్లు, ఇల్లు ఎలా ఉండేవో అలానే సెట్స్ వేస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారని సమాచారం.