అజిత్-టబు.. 22 ఏళ్ల తర్వాత

కొన్ని జంటలు కలిసి ఒక్క సినిమా చేసినా చాలు.. వాళ్ల పెయిర్స్ ఎప్పటికీ అలా గుర్తుండి పోతుంటాయి. అలా ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన జంట అజిత్-టబులదే. వీళ్లిద్దరూ కలిసి 90వ దశకం చివర్లో ‘కండుకొండేన్ కండుకొండేన్’ (తెలుగులో ప్రియురాలు పిలిచింది) అనే సినిమాలో జంటగా నటించాడు.

ఏస్ సినిమాటోగ్రాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో పాటు చార్ట్ బస్టర్లయ్యాయి. రెహమాన్ కెరీర్లోనే బెస్ట్ ఆల్బమ్స్‌లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. అజిత్-టబుల మధ్య వచ్చే ‘ఏమి చేయమందువే’ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటుంది. ఆ పాట.. సినిమాలో వారి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఇప్పుడు చూసినా మనసును హత్తుకుంటాయి.

అప్పటికి అజిత్ మాస్ హీరో కాదు. ఇలాంటి లవ్ స్టోరీల్లో భలేగా చేసేవాడు. ఇప్పుడంతా మాస్ మాస్ అంటూ ఒక మూసలో సాగిపోతున్నాడు.ఐతే అజిత్-టబు 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి నటించబోతుండటం విశేషం. అజిత్ త్వరలోనే ‘వలిమై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఖాకి’ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ రూపొందించిన సినిమా ఇది. మన యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్‌గా చేశాడు. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్న చిత్ర బృందం.. మళ్లీ ఓ సినిమా చేయబోతోంది.

అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇందులో అజిత్ మధ్య వయస్కుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇది థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందట. ఇందులో అజిత్‌కు జోడీగా టబు నటించనుందట. ఇలా ఇన్నేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించబోతుండటం ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించేదే. హీరోయిన్‌గా అవకాశాలు ఆగిపోయాక అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్‌తో ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది టబు.