అందరి దృష్టి హైకోర్టు పైనేనా ?

పీఆర్సీ సాధన కోసం ఒకవైపు ఉద్యోగుల ఆందోళన పెరుగుతుంటో మరోవైపు సమ్మెకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు దాఖలవుతున్నాయి. ఇప్పటికే గెజిటెడ్ అధికారుల సంఘం వేసిన కేసు విచారణకు పెండింగ్ లో ఉంది. ఒకరోజు జరిగిన విచారణలో చేసిన వ్యాఖ్యలతోనే న్యయస్ధానం ఆలోచన ఏమిటనే విషయంలో కాస్ల క్లారిటి వచ్చింది. పీఆర్సీ వల్ల జీతాలు పెరగాలే కానీ తగ్గకూడదనే ఉద్యోగసంఘాల నేతల వాదనను కోర్టు తప్పుపట్టింది.

ఉద్యోగుల జీతాలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టంచేసింది. అలాగే హెచ్ఆర్ఏ కారణంగా సమ్మెచేసే హక్కు ఉద్యోగులకు లేదని తేల్చిచెప్పింది. హోలు మొత్తంమీద తమ డిమాండ్లను ఉద్యోగులు సమ్మె ద్వారా కాకుండా చర్చల ద్వారా మాత్రమే సాధించుకోవాలని సూచించింది. పీఆర్సీ-సమ్మె నేపధ్యంలో ఉద్యోగుల సంఘం వాదనను కోర్టు కొట్టేసింది. అయితే విచారణ ఇంకా కంటిన్యు అవుతోంది. శుక్రవారం ఎం సత్యనారాయణమూర్తి బెంచ్ ముందుకు వచ్చింది.

ఇద్దరు సభ్యుల ధర్మాసనం మాత్రమే కేసును విచారించాలన్న అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి ప్రకారం నిర్ణయాధికారాన్ని చీఫ్ జస్టిస్ కు పంపారు. అందుకనే విచారణ వాయిదాపడింది. ఇదే సమయంలో సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలంటు విశ్రాంత ప్రొఫెసర్ సాంబశివరావు వేసిన పిట్ విచారణకు వచ్చింది. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం ఉద్యోగులకు సమ్మెచేసే హక్కు లేదన్నారు. ఉద్యోగులు సమ్మెచేయటం అన్నది వాళ్ళ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని సుప్రింకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

అధిక జీతాలు+హెచ్ఆర్ఏ కోసం ఉద్యోగులు చేస్తున్న సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమని ప్రొఫెసర్ వాదించారు. తన ప్రతివాదులుగా చీఫ్ సెక్రటరీ, ఆర్ధిక, రెవిన్యు శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు పీఆర్సీ సాధన సమతిని కూడా చేర్చారు. మొత్తం  మీత ప్రొఫెసర్ వేసిన పిల్ మీద విచారణ మొదలైంది. మరి ప్రతివాదులకు నోటీసులు ఎప్పుడు వెళతాయో, వాళ్ళెపుడు కోర్టుకొచ్చి తమ వాదనలను ఏ విధంగా వినిపిస్తారో చూడాలి. ఈ మొత్తంమీద అసలు సమ్మె విషయంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోందో అనేది చాలా కీలకంగా మారింది.