హీరోయిన్‌కు వర్మ 50 వేలు బాకీ

90వ దశకంలో తెలుగు సినిమాల్లో మెరిసిన కథానాయికల్లో మహేశ్వరి ఒకరు. శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి యావరేజ్ అందచందాలతోనే మంచి మంచి అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా జేడీ చక్రవర్తితో కలిసి చేసిన గులాబి, దెయ్యం.. వడ్డే నవీన్ సరసన నటించిన ‘పెళ్లి’.. రవితేజతో నటించిన ‘నీకోసం’ సినిమాలు చూసిన వాళ్లు మహేశ్వరిని అంత సులువుగా మరిచిపోలేరు.

చివరగా ‘మా అన్నయ్య’ సినిమాలో నటించిన మహేశ్వరి ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. మధ్యలో ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’ అనే టీవీ సీరియల్లో కనిపించి ఆ తర్వాత ఆమె మాయమైపోయింది. చాలా ఏళ్ల నుంచి లైమ్ లైట్లో లేని మహేశ్వరి.. తాజాగా కమెడియన్ ఆలీ నిర్వహించే టీవీ షోకు అతిథిగా వచ్చింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడింది.అందరూ మహేశ్వరిని.. శ్రీదేవి చెల్లెలు అనుకుంటూ ఉంటారని.. కానీ తాను శ్రీదేవి చెల్లెల్ని కాదని చెప్పింది మహేశ్వరి.

శ్రీదేవి తన తల్లికి చెల్లెలు అని, అంటే తనకు పిన్ని అని… కానీ తమ ఇద్దరికీ వయసు అంతరం తక్కువగా ఉండటంతో ఆమెను తాను అక్క అనేదాన్నని.. ఇండస్ట్రీ వాళ్లు కూడా అది చూసి తాను ఆమెకు చెల్లెలు అనుకున్నారని.. ఇదే ప్రచారంలో ఉండిపోయిందని మహేశ్వరి చెప్పింది. శ్రీదేవి ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా తన ఇంటికి వచ్చి ఎంతో ఆప్యాయంగా ఉండేదని.. ఆమె చనిపోయిందనే విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మట్లేదని.. షూటింగ్ కోసం ఫారిన్లో ఉందనే ఆలోచనలోనే ఉన్నానని మహేశ్వరి తెలిపింది.

ఇక తన సినిమా అనుభవాలకు సంబంధించి ఒక ఆసక్తిర విషయాన్ని మహేశ్వరి పంచుకుంది. రామ్ గోపాల్ వర్మ తనకు పాతికేళ్ల కిందట 50 వేలు బాకీ పడ్డాడని.. ఆ డబ్బులు ఇప్పటికీ అడుగుతుంటానని మహేశ్వరి వెల్లడించింది. ‘దెయ్యం’ సినిమా షూటింగ్‌ ఒకసారి అర్ధరాత్రి వేళ శ్మశానంలో చేశారని.. ఆ టైంలో వర్మ వచ్చి ఎవరైనా ఒంటిరిగా ఇక్కడి నుంచి రోడ్డు వరకు వెళ్లి వస్తే రూ.50 వేలు ఇస్తానని సవాల్ చేశారని.. తాను రాత్రి ఒంటి గంటకు ఒంటరిగా రోడ్డు వరకు వెళ్లి వచ్చానని.. అందరూ షాకయ్యారని.. కానీ వర్మ ఇచ్చిన మాట ప్రకారం 50 వేలు ఇవ్వనే లేదని మహేశ్వరి తెలిపింది.