చంద్రన్న మీటింగుల్లోనే తొక్కిసలాట ఎందుకు ?

వారం రోజుల్లోనే రెండు దుర్ఘటనలు. రెండు ఘటనల్లోనూ చంద్రబాబు, టీడీపీ కనెక్షన్. ఒకటి కందుకూరు. మరోకటి గుంటూరు. కందుకూరులో చంద్రబాబు కళ్లెదుటే తొక్కిసలాట జరిగింది. జనాన్ని వారించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు. గుంటూరు వికాస్ నగర్లో చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో కనీసం ముగ్గురు చనిపోయారు. కందుకూరులో ఇదేమీ ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా… జనం తోసుకుని, కిందపడి చనిపోయారు. గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో దుర్ఘటన చోటు చేసుకుంది.. సింబాలిక్ గా కొంత మందికి తన చేతుల మీదుగా చంద్రబాబు … కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్లిపోయిన తర్వాత కౌంటర్ల దగ్గర జనం తోసుకోవడం తొక్కిసలాటకు కారణమైంది.

పోలీస్ వైఫల్యమా…?

రెండు ఘటనల్లో పోలీస్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కందుకూరులో రోడ్ షో నిర్వహించేందుకు టీడీపీ నేతలు అనుమతి తీసుకున్నారని చెబుతూనే… భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని పోలీసు శాఖ సమర్థించుకుంది.. పైగా చంద్రబాబుపై ఎదురు కేసు పెట్టారు. గుంటూరులోని ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రబాబు జనతా వస్త్రాలు, పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణం నుంచి చంద్రబాబు వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగింది. కిట్ల కోసం ప్రజలు ఎగబడటం వల్లే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.

కందుకూరు సభలో తొక్కసలాటపై పోలీసుల వాదన మరోలా ఉంది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు, వెనక్కి జరగడం వల్లే జనంలో అయోమయ స్థితి ఏర్పడి తొక్కిసలాట జరిగిందని వారన్నారు. సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకు అనుమతిస్తే.. తర్వాత సభ నిర్వహించారన్నారు. అనుమతి లేకుండా బాణాసంచా కాల్చారని పోలీసులు ప్రత్యారోపణ చేశారు. గుంటూరు కార్యక్రమం విషయంలోనూ పోలీసులు, టీడీపీపైనే నెపం వేస్తున్నారు. పది వేల మంది వస్తారనుకున్న కార్యక్రమానికి పాతిక వేల మందిని రప్పించారని..ఇదీ స్థానిక నేతల ప్రాపకం కోసం జరిగిన పనేనని చెప్పుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా కనీసం అంబులెన్సులను కూడా పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి…

వైసీపీ ఆరోపణలేమిటి ? జనం భారీగా ఎందుకు వస్తున్నారు ?

చంద్రబాబు సభలకు జనం భారీ సంఖ్యలో వస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ప్రారంభించనప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ అధినేతకు పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. జగన్ పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు చంద్రబాబు సభలు ఒక సాధనంగా పనికి వస్తున్నాయి. వైసీపీ మాత్రం చిన్న ప్రదేశంలో సభలు నిర్వహించి ఎక్కువ మంది వచ్చినట్లు చూపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. డ్రోన్ షాట్స్ చూపించి పుట్టలు పగిలినట్లు జనం వచ్చారని తప్పెట వాయించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అంటోంది.. అది ఏ మాత్రం నిజం కాదని ఒరిజినల్ విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ప్రతీ సభలోనూ కనుచూపు మేరలో జనం ప్రభంజనం కనిపిస్తూనే ఉంది. రోడ్ షో రహదారులపైనే నిర్వహిస్తారన్న సంగతి వైసీపీ అర్థం చేసుకోవాలన్నది టీడీపీ కౌంటర్ …

కందుకూరు సభలో ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు వాహనం దిగారు. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తక్షణ సాయంగా ప్రతీ మృతుడి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరుసటి రోజుకు సాయం పాతిక లక్షల రూపాయలు దాటి పోయింది.. మృతుల కుటుంబంలో పిల్లల్ని చదివించే బాధ్యత తానే తీసుకుంటానన్నారు. కేంద్రం సాయం ప్రకటించిన తర్వాతే జగన్ సర్కారు తలా రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది..

ప్రభుత్వం బుద్ధిపూర్వక ఉదాసీనత

చంద్రబాబు సభల విషయంలో జగన్ ప్రభుత్వం బుద్ధిపూర్వక ఉదాసీనతను ప్రదర్శిస్తోంది. జెడ్ కేటగిరి భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడి సభకు ఇవ్వాల్సిన సెక్యురిటీ, సౌకర్యాలు కల్పించడం లేదన్న ఆరోపణలు వినిపస్తున్నాయి. అభిమాన జనాన్ని వారి మానాన వదిలేస్తోంది. కనీస భద్రత కల్పించేందుకు నిరాకరించినప్పుడే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పైగా జగన్ తన సభల్లో సెటైర్లు వేసి అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు….