5G: మన దేశంలో ఎప్పుడు?

ఇప్పుడు అందరూ 5జీ మాట్లాడుకుంటున్నారు. మిలీనియం ముందు వరకు ప్రజల జీవితాలకు ఏ మాత్రం పరిచయం లేని డిజిటల్ టెక్నాలజీ.. ‘2జీ’తో మొదలైంది. చూస్తుండగానే 3జీ రావడం.. అది కాస్తా పాపులర్ అవుతున్న వేళలోనే 4జీలోకి వచ్చేశాం. ఇప్పుడు చాలా దేశాల్లో 5జీ నడుస్తోంది. మన దేశంలోకి అప్పుడే 5జీ ఫోన్లు వచ్చేశాయి. చాలామంది వాడే ఫోన్లు 5జీ అయినా.. ఇప్పటికి దేశంలో అందుబాటులో ఉన్న 4జీతోనే సరిపెట్టుకునే పరిస్థితి. ఇంతకీ ఈ 5జీ అంటే ఏమిటి? 4జికి 5జీకి మధ్య ఉండే తేడా ఏంటి? మన దేశంలోకి ఈ 5జీ టెక్నాలజీ ఎప్పుడు రానుంది? అప్పుడు మన జీవితాల్లో వచ్చే మార్పు ఏమిటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం 4జీ సేవల్ని వినియోగిస్తున్నాం. ప్రతి సెకనుకు 10 ఎంబీ నుంచి 100 ఎంబీ వేగంతో డేటాను డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. అదే.. 5జీలో అయితే 4జీ కంటే 100 రెట్లు అధిక వేగంతో పని చేస్తుంది. అంటే తక్కువలో తక్కువ 1జీబీపీఎస్ వేగం ఉంటుంది. దాని పరిధి 10 జీబీ దాకా పెరగనుంది. ఈ సాంకేతిక అంశాలు.. అంకెల లెక్కల్ని పక్కన పెట్టి.. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక సినిమాను డౌన్ లోడ్ చేసుకోవటానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న 4జీలో నిమిషం పడితే.. 5జీ నెట్ వర్కులో జస్ట్ సెకనులో పూర్తి అవుతుంది. అంటే.. 4జీతో పోలిస్తే 5జీలో నెట్ వర్కు వేగం ఎంతలా పెరుగుతుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది.

ఇప్పటివరకు మనకు తెలిసిన 2..3..4జీలతో పోలిస్తే 5జీలో టవర్లు ఎక్కువ అవసరం. అయితే.. అంతకుముందు వాటి మాదిరి భారీగా టవర్లు అవసరం ఉండదు. ప్రతి 200 మీటర్ల నుంచి 500 మీటర్లకు టవర్ అవసరం ఉంటుంది. కాకుంటే.. ఇప్పుడున్న టవర్లకు అనుసంధానంగా విద్యుత్ స్తంభాలకు కానీ.. అపార్ట్ మెంట్ల మీద కానీ 5జీ పరికరాల్ని బిగిస్తారు.
ఈ పరికరాలు ఎలా ఉంటాయంటే.. మన ఇంట్లో వైఫైకు పెట్టుకునే రూటర్ల మాదిరి ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే.. 5జీలో వీధుల్లో ఏర్పాటు చేసే టవర్లు.. మన ఇంట్లో పెట్టే రూటర్ల మాదిరే. అంటే.. వీధి రూటర్లు అన్న మాట. 5జీలో వీధుల్లో అమర్చే ఒక్కో పరికరం ఖర్చు రూ.3 వేల లోపే ఉంటుందని చెబుతారు. ఈ కారణంగా మొబైల్ ఆపరేటర్లకు తక్కువ ఖర్చుతోనే 5జీ నెట్ వర్కును అందించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని నెట్ వర్కులకు కలుపుకొని 6.8 లక్షల సెల్ టవర్లు ఉన్నాయి. వాటికి మరో 8 లక్షల సెల్ టవర్లను కొత్తగా ఏర్పాటు చేస్తే.. ప్రధాన నగరాల్లోనే కాదు.. సెకండ్.. థర్డ్ టైర్ సిటీలకు 5జీ సేవల్ని విస్తరించే వీలు ఉంటుంది. దేశ వ్యాప్తంగా 5జీ సేవల్ని అందించేందుకు వీలుగా మొబైల్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. 5జీ సేవల్ని అందించే విషయంలో జియో ముందుంది. దీనికి కారణం.. ఆ సంస్థకు ఉన్న అన్ని సెల్ టవర్లు 4జీ టెక్నాలజీకి సంబంధించినవి కావటమే. కొద్ది మార్పులతో వాటిని 5జీ సాంకేతికతకు అనుగుణంగా మార్చుకునే వీలుంది. 2022లో వెయ్యి నగరాల్లో తాము 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని జియో ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు కొనసాగుతోంది.

ఇక.. జియోకు పోటీగా ఉన్న ఎయిర్ టెల్  కూడా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే బాటలో వొడాఫోన్.. ఐడియాలు కూడా అప్ గ్రేడ్ అవుతున్నాయి. మొత్తంగా ఈ ఏడాది చివరకు దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2016 నుంచి 5జీ సేవల మీద పని చేస్తోంది. కానీ.. మిగిలిన వారి కంటే వెనుకబడి ఉందని చెప్పాలి. అయితే.. ఈ మధ్యన కాస్త వేగవంతమైన ఈ సంస్థ ఇప్పుడు టెస్టు బెడ్  పరీక్షల్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఈ 5జీ నెట్ వర్క్ కారణంగా దాదాపుగా కోటి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ టెక్నాలజీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెషిన్ లెర్నింగ్.. బిగ్ డేటా అనలిటిక్స్.. క్లౌడ్ కంప్యూటింగ్.. రోబోటిక్ ప్రాసెస్.. ఆటోమేషన్. గేమింగ్.. ఎడ్ టెక్.. హెల్త్ టెక్ విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు.

ఒక అంచనా ప్రకారం మన దేశంలోకి 5జీ రాక ముందే.. దేశంలోని 2.89 కోట్ల మంది 5జీ నెట్ వర్కుకు అండగా నిలిచే ఫోన్లను వినియోగిస్తుండటం గమనార్హం. 5జీ రాకముందే.. దాన్ని సపోర్టు చేసే ఫోన్లు అందుబాటులోకి రావటం.. తర్వాత మార్చుకునే కన్నా.. కొత్తగా ఫోన్ కొనేవారు.. 5జీని వాడేందుకు వీలుగా ఉన్న సెల్ ఫోన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహానగరాలు.. నగరాలు.. పట్టణాల్లో తొలుత 5జీ నెట్ వర్కు అందుబాటులోకి వస్తుందని.. గ్రామాలకు మాత్రం ఈ టెక్నాలజీ రావటానికి కొంత సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఎందుకంటే.. దాన్ని వాడే వారి సంఖ్య పరిమితంగా ఉండటం ఒకకారణంగా చెబుతున్నారు. ఏమైనా.. ఇప్పటికే వేగవంతమైన జీవితాలు.. 5జీ వేళ.. మరింత వేగంగా మారిపోతాయని చెప్పక తప్పదు.