స‌రోగ‌సీపై ఆమె ట్వీట్లు.. ప్రియాంక ఫ్యాన్స్ హ‌ర్టు

సెల‌బ్రెటీలు స‌రోగ‌సీ ద్వారా బిడ్డ‌ల్ని క‌న‌డం కొత్తేమీ కాదు. బాలీవుడ్లో ఇలా బిడ్డ‌ల్ని క‌న్న జంట‌లు చాలానే ఉన్నాయి. ఈ విష‌యంలో విమ‌ర్శ‌ల‌కు కూడా లోటు లేదు. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వాళ్లు, బిడ్డ‌లు పుట్టే అవ‌కాశం లేని వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఓకే కానీ.. అందం చెడిపోతుంద‌నో, బిడ్డ‌ను తొమ్మిది నెల‌లు మోయ‌డం క‌ష్ట‌మ‌నో, పురిటి నొప్పులు భ‌రించడానికి భ‌య‌ప‌డో ఈ మార్గం ఎంచుకోవ‌డమే త‌ప్పంటూ అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి.

సెల‌బ్రెటీలు స‌రోగ‌సీ బాట ప‌ట్టిన‌పుడ‌ల్లా ఈ విష‌యంలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతుంటుంది. తాజాగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ న‌టుడైన‌ ఆమె భ‌ర్త నిక్ జోనాస్ క‌లిసి స‌రోగ‌సీ మార్గంలో బిడ్డ‌ను క‌న్న‌ట్లు స‌మాచారం బ‌య‌టికి రాగానే సోష‌ల్ మీడియాలో వీరిపై కౌంట‌ర్లు ప‌డ్డాయి. ఐతే ఇంట‌ర్నెట్లో సాధార‌ణ స్థాయి వ్య‌క్తులు చేసే కామెంట్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు కానీ.. ఒక సెల‌బ్రెటీ దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తే మాత్రం అది క‌చ్చితంగా అది చ‌ర్చ‌నీయాంశమే.

ఇస్లాం మ‌త ఛాంద‌సవాదానికి వ్య‌తిరేకంగా పోరాడటంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన బంగ్లాదేశ్ వివాదాస్ప‌ద ర‌చ‌యిత్రి త‌స్లీమా న‌స్రీన్.. డ‌బ్బున్న వాళ్లు స‌రోగ‌సీ ద్వారా బిడ్డ‌ను క‌న‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘‘ధనవంతులైన మహిళలు కూడా సరోగేట్ మామ్‌గా మారనంతవరకు నేను సరోగసీని ఒప్పుకొను. పురుషులు బుర్ఖాను వేసుకొనంత వరకు నేను దానిని సమర్థించను. సరోగసీ, బుర్ఖా అనేవి పేదలు,మహిళలను దోపిడి చేసేందుకే’’ అని త‌న ట్వీట్లో తస్లీమా పేర్కొంది.

ఐతే ఎక్క‌డా ప్రియాంక, నిక్‌ల పేర్లు ఎత్త‌క‌పోయినా.. వారు స‌రోగ‌సీ ద్వారా బిడ్డ‌ను క‌న్న‌ట్లు వార్త బ‌య‌టికి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే త‌స్లీమా ఈ ట్వీట్ వేయ‌డంతో అగ్గి రాజుకుంది. ప్రియాంక‌ను విమ‌ర్శిస్తావా అంటూ ఆమె అభిమానులు త‌స్లీమాపై దండ‌యాత్ర‌కు వ‌చ్చారు. ఐతే తాను ప్రియాంక‌, నిక్‌ల‌ను ఉద్దేశించి ట్వీట్ చేయ‌లేద‌ని త‌స్లీమా స్ప‌ష్టం చేసింది. వాళ్లంటే త‌న‌కిష్ట‌మ‌ని పేర్కొంటూ.. ప్రియాంక‌తో గ‌తంలో ట్విట్ట‌ర్లో జ‌రిపిన సంభాష‌ణ‌లు, ఒక‌రినొక‌రు అభినందించుకున్న ట్వీట్లు షేర్ చేసింది త‌స్లీమా. త‌న‌ను ప్రియాంక‌కు వ్య‌తిరేకిగా మార్చేందుకు ఒక వ‌ర్గం చాలా క‌ష్ట‌ప‌డుతోంద‌ని కూడా ఆమె విమ‌ర్శించింది.