ఏపీలో అరాచ‌క పాల‌న‌.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్‌

ఏపీలో జగన్మోహన్‌రెడ్డి అవినీతి, అరాచ‌క‌ పాలన మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతోంద‌ని కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు మురళీధరన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీజేపీ నేత బుడ్డా  శ్రీకాంత్‌రెడ్డిని.. తాజాగా మురళీధరన్‌ పరామర్శించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలేసి, అలాంటి వాటిని అడ్డుకోబోయిన శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు.

ఏపీలో అశాంతి నెలకొందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎం జగన్ పాలనపై దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ నాయకులు రాష్ట్రంలో రెచ్చిపోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలకు తెరలేపారని, ఏపిలో ఇస్లామిక్ ప్రేరేపిత కార్యకలాపాలు ఎక్కువయ్యాయన్నారు. అల్లర్లకు కొందరు ప్రోత్సహిస్తున్నారని, దీనికి సీఎం బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.

ఆత్మకూరు బీజేపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని మురళీధరన్ అన్నారు.  వైసీపీ నేతలు ప్రభుత్వం రాక మునుపు ఒక మాట.. వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాంత్ రెడ్డిని చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారని మురళీధరన్ ఆరోపించారు.  

“బీజేపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి. శ్రీకాంత్‌ను చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారు. బీజేపీ నేతలను ఆత్మకూరుకు పంపాలి. అల్లర్లు జరిగిన రోజు నుంచి బీజేపీ నేతలను అక్కడికి పంపలేదు. జగన్ అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పాలనపై సీఎం దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. అల్లర్లను కొందరు ప్రోత్సహిస్తున్నారు.. సీఎం బాధ్యత వహించాలి“ అని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. మ‌రి దీనికి వైసీపీ నేత‌లు ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.