అనూహ్యంగా పెరిగిపోతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందులో 14,450 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారవర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో మూడో వంతు మందికి కరోనా ఉండటమంటే మామూలు విషయం కాదు. జనవరి 10వ తేదీన రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు 4 శాతం ఉంది.

అలాంటిది 23వ తేదీకి పాజిటివిటీ రేటు  31 శాతానికి పెరిగింది. అంటే 14 రోజుల్లో పాజిటివిటీ రేటు 27 శాతం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో కనబడుతోంది. ఒక్క ఆదివారం మాత్రమే జిల్లాలో 2258 కేసులు నమోదయ్యాయి. వారం క్రితంవరకు కేవలం 2 జిల్లాల్లో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఇపుడు కృష్ణా జిల్లా తప్ప మిగిలిన 12 జిల్లాల్లో సగటున 500 కేసులు నమోదవుతున్నాయి. వీటిల్లో కూడా 8 జిల్లాల్లో  సగటున వెయ్యి కేసులు రికార్డవుతుండటమే టెన్షన్ పెంచేస్తోంది.

ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరులో 1438 కేసులు, ప్రకాశ జిల్లాలో 1399 కేసులు, కర్నూలు జిల్లాలో 1238 కేసులు, చిత్తూరు జిల్లాలో 1138, నెల్లూరు జిల్లాలో 1103 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1012 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 18వ తేదీన 462 కేసులు నమోదైతే 23వ తేదీ వచ్చేటప్పటికి  1534 కేసులకు పెరిగింది. గుంటూరు జిల్లాలో కూడా 758 కేసుల నుండి 1438 కేసులకు పెరిగింది.

ఒకపుడు బాగా కేసులు నమోదైన చిత్తూరు జిల్లాలో ఇపుడు క్రమంగా తగ్గుతోంది. ఇక్కడ ప్రధానంగా టీటీడీ తీసుకుంటున్న చర్యలతో పాటు ఇతర అధికార యంత్రాంగం కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవటం వల్ల కేసుల సంఖ్య తగ్గుతోంది. ఏదేమైనా కరోనా వైరస్+ఒమిక్రాన్ కేసులు కొన్ని జిల్లాల్లో బాగా పెరుగుతు మరికొన్ని జిల్లాల్లో తక్కువగా ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కేసుల సంఖ్య తగ్గే అవకాశముంది. మొత్తానికి అధికార యంత్రాంగం మరికొంత కొంతకాలం పాటు రిలాక్సయ్యేందుకు అయితే లేదు.