సీఎం జ‌గ‌న్‌, సాయిరెడ్డిల‌కు ఆర్ ఆర్ ఆర్ సవాల్‌

త‌న మాట‌ల‌తో రాజ‌కీయాల‌ను వేడెక్కించే వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయిరెడ్డికి సంచ‌ల‌న స‌వాల్ రువ్వారు. కొన్నాళ్లుగా త‌న‌పై సాయిరెడ్డి చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడ‌తాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా విజ‌యసాయిరెడ్డి.. త‌న‌ను పారిపోయార‌ని.. సీఐడీ నోటీసులు ఇస్తే.. త‌ప్పించుకున్నార‌ని.. ఎంపీ ప‌ద‌వికి రాజీనామా విష‌యంలో దోబూచులు ఆడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్న‌ట్టు ర‌ఘురామ తెలిపారు. అయితే.. తాను పారిపోలేద‌ని.. త‌న ఎంపీ బాధ్య‌త‌ల్లో భాగంగానే ఢిల్లీకి వ‌చ్చాన‌ని.. సీఐడీ ఇచ్చిన నోటీసుల‌పై కోర్టులో కేసు వేశాన‌ని అన్నారు.

ఈ క్ర‌మంలోనే ఎంపీ సాయిరెడ్డికి, సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ స‌వాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఇద్ద‌రు నేత‌లు.. ఒప్పుకొంటే.. తక్షణం త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తానని అన్నారు. త‌న స‌వాలుకు ఇద్ద‌రు నేత‌లు స్పందించాల‌ని అన్నారు. తాను త‌ప్పించుకునే టైపు కాద‌ని ర‌ఘురామ తెలిపారు. అంతేకాదు.. ఇప్పుడైనా త‌న స‌వాల్‌ను స్వీక‌రిస్తే.. వెంట‌నే త‌న‌పై వేటు వేయించాల‌ని.. లేక‌పోతే.. వేయించ‌లేన‌ని ఒప్పుకోవాల‌ని అన్నారు. ఇప్పుడు బంతి జ‌గ‌న్‌, సాయిరెడ్డి చేతుల్లోనే ఉంద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. ఇక‌, ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని వెల్లడించారు.

తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును ఏపీ సీఎం జ‌గ‌న్‌ నిలిపివేయించారన్నారు. గుడివాడ క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పిన రఘురామ.. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుందని రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ విధి అన్నారు. పీఆర్సీ వివాదంపై సీఎం నిర్దేశం ప్రకారం మంత్రులు ప్రజల ముందుకెళ్తే… ప్రభుత్వానికి నష్టమన్నారు.