ఆ అధికారం మీకెక్క‌డిది? సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ ఘాటు లేఖ‌

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం చంద్ర‌బాబు హ‌యాంలో ఉద్య‌మించిన నాయ‌కుడు. అయితే.. త‌న ఉద్య‌మాన్ని ఆయ‌న కొన్నాళ్ల కింద‌టే ప‌క్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలో కాపు ఉద్య‌మం నుంచి కూడా తాను త‌ప్పుకొంటున్న‌ట్టు చెప్పేశారు. అయితే. ప్ర‌జ‌ల కోసం.. తాను నిరంత‌రం.. ప‌నిచేస్తుంటాన‌ని మాత్రం వెల్ల‌డించిన ఆయ‌న‌.. త‌ర‌చుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖలు రాస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ముద్ర‌గ‌డ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఒకింత ఘాటుగానే ఆయ‌న ఈ లేఖ‌లో సీఎంను ప్ర‌శ్నించారు.

ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన వ‌న్ టైం సెటిల్‌మెంట్ ప‌ధ‌కంపై ముద్రగ‌డ త‌న లేఖ‌లో సీఎం జ‌గ‌న్‌కు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని త‌న లేఖ‌లో సీఎంను కోరారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు… గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు..

అంతేకాదు.. ఓటీఎస్ వ‌ల్ల ఎంతో మంది పేద‌లు.. క‌నీసం క‌డుపునిండా అన్నం తిన‌లేని ప‌రిస్తితి వ‌చ్చింద‌ని… కంటి నిండా నిద్ర కూడా పోలేక పోతున్నార‌ని.. క‌రోనా కార‌ణంగా..ఇప్ప‌టికే ఉపాధి కోల్పోయిన ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు గోరుచుట్టుపై రోక‌లి పోటు మాదిరిగా ఓటీఎస్ అంటే.. ఎలా? అని ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే ఓటీఎస్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ముద్రగ‌డ లేఖ‌లో కోరారు. ఈ సంద‌ర్భంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో వలంటీర్లు చేస్తున్న ఒత్తిళ్ల‌ను ఆయ‌న ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.

‘ఓటీఎస్‌ను స్వ‌చ్ఛంద‌మ‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. నిజ‌మ‌ని అనుకున్నాం. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఓటీఎస్‌కు ఒప్పుకోక‌పోతే.. పింఛ‌న్లు ఆపేస్తామ‌ని.. క‌రెంటు క‌ట్ చేస్తామ‌ని.. నీటి కుళాయిల‌కు తాళం వేస్తామ‌ని బెదిరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాల‌ను మీకు పంపుతున్నాను. మీరు ఇచ్చిన మాట‌కు కూడా విలువ లేక‌పోతే.. ప్ర‌జ‌లు ఇంకెవ‌రిని న‌మ్మాలి. ఓటీఎస్ అనేది మీరు చెప్పిన‌ట్టు స్వ‌చ్ఛంద‌మే అయితే.. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోండి’ అని ముద్ర‌గడ త‌న లేఖ‌లో విన్న‌వించారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ కానీ.. ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.