ప్రియాంక గాంధీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. సీఎం అభ్య‌ర్థిగా త‌నే!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఈ రోజు సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఇందిర‌మ్మ మ‌న‌వ‌రాలు.. ప్రియాంక గాంధీ పేరు ఖాయ‌మ‌ని తెలిసింది. మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై ప్రియాంక గాంధీ హింట్‌ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమె పేరు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ యూత్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ.. “ఇంకెవరైనా కన్పిస్తున్నారా? మరి ఇంకేంటీ? ఎక్కడ చూసినా నేనే కన్పిస్తున్నానుగా..! చూడట్లేదా?” అని అన్నారు. దీనిని బ‌ట్టి కాంగ్రెస్ క‌నుక అధికారంలోకి వ‌స్తే.. ప్రియాంక గాంధీనే ముఖ్య‌మంత్రి అవుతుంద‌ని మీడియా ప్ర‌చారం ప్రారంభించింది.

దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక పేరునే ప్రకటించే అవకాశాలు దాదాపు ఖాయంగానే కన్పిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్‌ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టొచ్చు. అయితే ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనసమండలి ఏదో ఒకదానికి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. గతంలో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎమ్మెల్సీనే కావడం గమనార్హం. కాగా.. వచ్చే ఎన్నికల్లో యోగి గోరఖ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగుతుండగా.. అఖిలేశ్‌ కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

అఖిలేశ్ తన కుటుంబానికి మంచి పట్టున్న మెయిన్‌పురిలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించింది. ఇక‌, 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే ఈ ఎన్నికలు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ప్రియాంక కావ‌డంతో ఎన్నిక‌ల్లో ఫ‌లితం తారుమార‌వుతుంద‌నే ఊహాగానాలు కూడా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.