‘గుడివాడ‌లో గోవా’ నిజాలు తేల్చ‌నున్న టీడీపీ!

‘గుడివాడ‌లో గోవా’.. ఇటీవ‌ల సంక్రాంతి సంద‌ర్భంగా.. కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కొడాలి నానికి చెందిన సొంత కె-క‌న్వెన్షన్‌లో గోవా త‌ర‌మా కేసినో న‌డిచింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఎక్క‌డెక్క‌డి నుంచో జూద ప్రియుల‌ను ఇక్క‌డ‌కు ఆహ్వాన‌నించి.. భారీ స్థాయిలో జూదాలు నిర్వ‌హించార‌ని. ఆధారాల‌తో స‌హా.. కొన్ని మీడియా సంస్థ‌లు వెలుగులోకి తెచ్చాయి. అయితే.. దీనిపై అటు ప్ర‌భుత్వం కానీ.. ఇటు ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానీ కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రియాక్ట్ కాలేదు.

అంతేకాదు..ఎవ‌రికి వారు.. తేలుకుట్టిన‌ట్టుగా.. మౌనంగా ఉన్నారు. అయితే.. ఈ విష‌యంలో అస‌లు ఏం జ‌రిగిందనే విష‌యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గుడివాడలో క్యాసినో నిర్వహణపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న మేర‌కు వారు శుక్ర‌వారం గుడివాడ‌లో ప‌ర్య‌టించి..కేసినోపై వాస్త‌వాల‌ను ప‌రిశీలించే ప్ర‌య‌త్నం చేస్తారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఈ కమిటీకి సమన్వకర్తగా వ్యవహరిస్తారు. కొడాలి కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన క్యాసినోపై కమిటీ పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అధిష్టానానికి ఇవ్వనుంది. జూదాలతో ఈ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భ్రష్టుపట్టిస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అయితే.. ఇక్క‌డ అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

అస‌లు టీడీపీ నేత‌ల‌ను గుడివాడ‌లో స‌ర్కారు ప్ర‌ముఖులు.. మంత్రి కొడాలి వ‌ర్గం అడుగు పెట్ట‌నిస్తుందా? లేక ఇంటికే ప‌రిమితం చేసి.. తెల్ల‌వారు జాము నుంచే గృహ‌నిర్బంధం చేస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. గ‌తంలోనూ గుంటూరులో ఒక ఎస్సీ యువ‌తిపై అత్యాచారం జ‌రిగిన‌ప్పుడు.. ఆ కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో పార్టీ కీల‌క నేత‌… మాజీ మంత్రి నారా లోకేష్‌ను వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రి కొడాలిపైనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నందున‌.. అస‌లు అక్క‌డ‌కు వెళ్లనిస్తారా? అనేది ప్ర‌శ్న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.