ఏపీ స‌ర్కారుకు మ‌రింత సెగ‌

ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రింత సెగ త‌గ‌ల‌నుందా? ఇప్ప‌టికే త‌మ‌కు పీఆర్సీతో తీవ్ర న‌ష్టం చేకూర్చారంటూ.. తీవ్ర ఆవేద‌న, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న  ఉద్యోగ సంఘాలు.. తాజాగా మ‌రింత తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మాన్ని వేడెక్కించాల‌ని నిర్ణ‌యించాయి. ఈ క్ర‌మంలో అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని.. అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని అభిప్రాయపడ్డాయి. శుక్ర‌వారం నాటి సమావేశంలో విధివిధానాలను నిర్ణయిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.

ఉమ్మడి కార్యాచరణపై ఈనెల 21వ తేదీన శుక్రవారం సచివాలయంలో మరోమారు భేటీ అవుతామని నేత లు ప్ర‌క‌టించారు. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తామని నాయ‌కులు  వెల్లడించారు. “సమ్మె నోటీసు విషయమై మేము కట్టుబడి ఉన్నాం. సమ్మె నోటీసు విషయమై ఉద్యోగ సంఘాల భేటీలో చర్చిస్తాం. సమ్మె విషయంలో మాతో పాటు కలిసి రావడంపై చర్చిస్తాం. ఉద్యోగ సంఘాలతో చర్చించాక ఉమ్మడి కార్యాచరణ నిర్ణ‌యిస్తాం అని  జేఏసీ నేత‌ బండి శ్రీనివాసరావు తెలిపారు.

శుక్ర‌వారం ఉద్యోగ సంఘాలు భేటీ అవుతాయని అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంక‌టేశ్వ‌ర్లు వెల్లడించారు. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తామని చెప్పారు. 11వ పీఆర్సీ సాధన విషయమై భేటీలో చర్చిస్తామన్న ఆయన.. నాలుగు ఉద్యోగ సంఘాల నాయకులం ఒకే వేదికపైకి వచ్చామని స్పష్టం చేశారు. ఉమ్మడి కార్యాచరణ కోసం ఏకాభిప్రాయానికి వస్తామని వివరించారు.

“అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని నిర్ణయం. రేపు సచివాలయంలో ఉద్యోగ సంఘాల భేటీ ఉంటుంది. రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తాంష‌ – అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.. మొత్తానికి ఈ ప‌రిణామంతో ఏపీ ప్ర‌బుత్వానికి సెగ భారీగా పెరుగడం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.