స్టార్ హీరోల టాక్ షోస్.. బాలయ్య ఎఫెక్టా?

ఓటీటీ టాక్ షోస్‌ని తన కరిష్మాతో పెద్ద మలుపే తిప్పారు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్‌’ అంటూ ఆయన చేసే సందడి ఆడియెన్స్‌కే కాదు, గెస్టులుగా వచ్చే సెలెబ్రిటీలకు కూడా తెగ నచ్చేసింది. ఇంకేముంది.. షో సూపర్‌‌ హిట్టయ్యింది.       ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోలు టాక్ షోస్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆ ఇద్దరూ ఎవరో కాదు.. వెంకటేష్, అల్లు అర్జున్. బాలయ్య షో సక్సెస్ కావడంతో వీరిద్దరితో కూడా ఆహా సంస్థ స్పెషల్ టాక్ షోస్ ప్లాన్ చేసిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మధ్యమధ్యలో చిరంజీవి పేరు కూడా వినిపిస్తుండటం విశేషం.   

మెగాస్టార్‌‌కి షో చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ బుల్లితెర కోసం మీలో ఎవరు కోటీశ్వరులు షోకి హోస్ట్ చేశారు. కాబట్టి ఆయన మరోసారి ఆసక్తి చూపించే చాన్స్ లేకపోలేదు. ఇక బన్నీ గలగలా మాట్లాడతాడు కాబట్టి, పైగా ఆహా తన సొంత సంస్థ కాబట్టి ఓకే అనే అవకాశమూ ఉంది.     

అయితే వెంకటేష్ విషయంలోనే డౌటంతా. ఆయన ఎక్కువ మాట్లాడరు. ఏదైనా ఈవెంట్‌కి వచ్చినా తాను చెప్పాలనుకున్నది మూడు ముక్కల్లో సూటిగా చెప్పేసి ముగిస్తారు. సోషల్ మీడియాలోనూ మిగతా హీరోలంత  యాక్టివ్‌ కాదు. పైగా స్పిరిచ్యువల్‌గా ఉండే వ్యక్తి. మరి ఆయన తన మాటలతో షోకి మసాలా అద్దగలరో లేదో. అసలీ వార్తల్లో నిజం ఉందో లేక ఇదంతా బాలయ్య ఎఫెక్టో.