T బీజేపీలో సీక్రెట్ మీట్.. హై క‌మాండ్ సీరియ‌స్!

తెలంగాణ‌లో అధికారమే ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన బీజేపీ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.  అక్క‌డ పార్టీ విజ‌యానికి మంచి అవ‌కాశాలున్నాయ‌ని భావించిన అధిష్ఠానం కూడా నాయ‌కుల‌కు అండ‌గా నిలుస్తోంది. కానీ ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్ర బీజేపీలో నెల‌కొన్న లుక‌లుక‌ల ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తెలంగాణ బీజేపీలో అంత‌ర్గ‌తంగా నెల‌కొన్న విభేదాలు తెర‌పైకి వ‌చ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఓ వ‌ర్గం ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించ‌డమే అందుకు కార‌ణం.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అత‌ని సార‌థ్యంలో పార్టీ జోరు అందుకుంది. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోఫ‌లితాలే అందుకు నిద‌ర్శ‌నం. దీంతో ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ప్ర‌ధాన పోటీదారు బీజేపీనే అనే అభిప్రాయాలు క‌లుగుతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలోని విభేదాలు భ‌గ్గుమ‌న‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సంజ‌య్ వ్య‌తిరేక వ‌ర్గం సీక్రెట్ మీటింగ్ పెట్ట‌డం.. ఆ త‌ర్వాత జిల్లాల వారీగానూ ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించ‌డం దుమారం రేపుతోంది. టీఆర్ఎస్‌పై పైచేయి సాధించే దిశ‌గా పార్టీ సాగుతున్న స‌మ‌యంలో ఈ విభేదాలు రావ‌డాన్ని పార్టీ అధిష్ఠానం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని తెలిసింది.

బండి సంజ‌య్ సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్ నుంచే ఈ వ్య‌తిరేక వ‌ర్గం యాక్టివ్ కావడాన్ని హైక‌మాండ్ సీరియ‌స్‌గా తీసుకుంది. ఆ ర‌హ‌స్య స‌మావేశానికి క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడు అర్జున్ రావు నాయ‌క‌త్వం వ‌హించార‌ని బీజేపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామ‌కృష్ణారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుగుణాక‌ర్ రావు కూడా ఈ వ్య‌వ‌హారంలో కీల‌క పాత్ర పోషించార‌ని స‌మాచారం. దీంతో ఈ అస‌మ్మ‌తి నేత‌ల వ్య‌వ‌హారాన్ని తేల్చేందుకు ఇంద్ర‌సేనా రెడ్డికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌ని దీనిపై నివేదిక అందించాల‌ని ఆదేశించింద‌ని తెలిసింది. మ‌రోవైపు ఈ ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించిన నాయ‌కులంద‌రినీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తార‌ని టాక్‌. దీంతో ఆ నాయ‌కులంతా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిశార‌ని స‌మాచారం.

ఈ ర‌హస్య స‌మావేశాల్లో వ‌రంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మారావు, రాజేశ్వ‌ర‌రావు, న‌ల్గొండ‌కు చెందిన చింతా సాంబ‌మూర్తి, నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌తో పాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్‌, ఆదిలాబాద్‌కు చెందిన నాయ‌కులు కూడా పాల్గొన‌ట్లు తెలిసింది. ఇప్పుడు వీళ్లంద‌రిపై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని హైక‌మాండ్ అనుకుంటుంద‌ని స‌మాచారం. దీంతో ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.