సుకుమార్ చేతికి రౌడీ బాయ్స్ హీరో

ఇటీవ‌లే టాలీవుడ్లోకి కొత్త‌గా హీరోగా అడుగు పెట్టాడు యువ క‌థానాయ‌కుడు ఆశిష్ రెడ్డి. అగ్ర నిర్మాత‌ దిల్ రాజు సోద‌రుడు శిరీష్ రెడ్డి కొడుకే ఈ అశిష్‌. అరంగేట్రానికి ముందు న‌ట‌న‌లో, డ్యాన్సులు, ఫైట్ల‌లో బాగానే ట్రైన్ అయిన‌ట్లున్నాడేమో.. తొలి సినిమాలో మంచి ఈజ్‌తో న‌టించాడు. డ్యాన్సులు, ఫైట్ల‌లో చురుకుద‌నం చూపించాడు. కాక‌పోతే సినిమానే అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు లేక‌పోవ‌డంతో ఓ మోస్త‌రు వ‌సూళ్లతో స‌రిపెట్టుకుంది.

తొలి సినిమాతో త‌న వ‌ర‌కు మంచి మార్కులు వేయించుకున్న ఆశిష్‌.. రెండో చిత్రానికి సుకుమార్ కాంపౌండ్లోకి అడుగు పెడుతున్నాడు. అత‌డి రెండో సినిమాను నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించాడు. త‌మ బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ క‌లిపి ఆశిష్ రెండో చిత్రాన్ని నిర్మించ‌బోతున్న‌ట్లు రాజు ప్ర‌క‌టించాడు.

సుకుమార్ శిష్యుడైన కాశి.. ఆశిష్ రెండో సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్టులో సుక్కు భాగ‌స్వామ్యం కూడా ఉండ‌బోతోంది. కాశి ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా త‌న అరంగేట్ర చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. చిత్తం మ‌హారాణి పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోపే ఓ క‌థ చెప్పి సుకుమార్, రాజుల‌ను మెప్పించి ఆశిష్‌తో సినిమా సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సుకుమార్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసింది రాజే. వీరి కల‌యిక‌లో వ‌చ్చిన ఆర్య మూవీతో చాలామంది జీవితాలు మారిపోయాయి.

ఆ త‌ర్వాత ఇప్ప‌టిదాకా సుకుమార్‌తో రాజు సినిమా తీయ‌లేదు. ఇప్పుడు ఇలా ఇద్ద‌రూ నిర్మాత‌లుగా సినిమా చేస్తున్నారు. దీని త‌ర్వాత కూడా రాజు, సుకుమార్ క‌ల‌యిక‌లో ఇంకో సినిమా వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఇదిలా ఉంటే.. రౌడీ బాయ్స్ సినిమాకు మౌత్ టాక్‌తో వ‌సూళ్లు పెరుగుతున్నాయ‌ని.. ఈ చిత్రం ఇప్ప‌టిదాకా రూ.7 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ సాధించింద‌ని, ఒక కొత్త హీరో సినిమాకు ఇవి మంచి వ‌సూళ్ల‌ని చెప్పాడు దిల్ రాజు.