కొత్త జీతం వద్దు.. పాతదే ముద్దు

మీరే చేసేది ఏ ఉద్యోగం అయినా కావొచ్చు. కొత్తగా జీతం పెంచారంటే ఏమని ఆశిస్తారు? పాత జీతం కంటే ఎక్కువ మొత్తం వస్తుందనుకుంటారు. కానీ.. అలా కాకుండా పాత జీతం కంటే కొత్త జీతం తక్కువగా ఉంటే? అదెక్కడైనా ఉందా? అని ఆశ్చర్యపోవచ్చు. ఉండటమే కాదు.. ఇప్పుడదే పెద్ద రచ్చగా మారింది ఏపీలో. గడిచిన కొంతకాలంగా తమకు ఇవ్వాల్సిన పీఆర్సీ లెక్క తేల్చమని.. తమ జీతాలు పెంచాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయటం తెలిసిందే. దీనికి స్పందించిన జగన్ ప్రభుత్వం కొత్త జీతాన్ని ప్రకటించటం తెలిసిందే.

వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శరాఘాతంగా మారింది. ఇలా ఎవరైనా చేస్తారా? ప్రపంచంలో అంటూ ఏపీ ఉద్యోగులు హాహాకారాలు చేస్తున్నారు. కొత్తగా డిసైడ్ చేసిన జీతం.. పాత జీతం కంటే తక్కువగా వస్తున్నట్లుగా వారు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ఇస్తున్న కొత్త జీతాన్ని తప్పుడు లెక్కలు చెప్పి.. తప్పుదారి పట్టిస్తున్నట్లుగా ఏపీ అధికార పక్ష నేతలు చెబుతున్నారు. అలాంటిదేమీ లేదని.. పాత జీతం కంటే కొత్త జీతం తక్కువంటూ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉదాహరణతో సహా చెబుతున్నారు.

వారు చెబుతున్న లెక్కను చూస్తే.. కొత్త జీతం కంటే పాత జీతమే ఎందుకు ముద్దు అవుతుందో ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాల వారు చెబుతున్న లెక్కను యథాతధంగా తీసుకుంటే..

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో పని చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం రూ.30,580. పాత పీఆర్సీ ప్రకారం.. ఐఆర్.. మొత్తం డీఏలు.. 20 శాతం హెచ్ఆర్ లు కలుపుకొని వచ్చే జీతం రూ.61,938. దీన్ని బ్రేకప్ చేస్తే..
మూల వేతనం  రూ.30,580
డీఏ కింద రూ.16,985
హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలెవెన్సు) రూ.6116
మధ్యంతర భ్రతి  రూ.8257 అందుతాయి.
కొత్త విధానం ఎలా ఉంటుందన్నది చూస్తే..
మూల వేతనం రూ.47,090
డీఏ  రూ.9427
హెచ్ఆర్ ఏ రూ.3767
సీసీఏ లేదు.

దీంతో.. అతనికి వచ్చేది రూ.60,284.అంటే.. పాత జీతంతో పోలిస్తే కొత్త జీతం రూ.1654 వరకు నష్టపోతాడు. పై లెక్కను చూస్తే.. మూలవేతనం భారీగా పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ. డీఏ దగ్గర.. హెచ్ఆర్ఏ దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోతుంది. అంటే.. మూలవేతం పెరిగినప్పటికి.. డీఏ.. హెచ్ఆర్ ఏ తగ్గిపోవటంతో చేతికి జీతం వచ్చేసరికి తేడా కొట్టేస్తుంది.
ఒక జల్లాలోని ప్రభుత్వఉద్యోగికి కొత్త.. పాతలకు మధ్య తేడా ఇలా ఉంటే.. ఏపీ సచివాలయంలో పని చేసే ఉద్యోగికి వచ్చే జీతం తేడాను చూస్తే.. మరింత బాగా అర్థమవుతుందని చెబుతున్నారు.

సచివాలయంలోని ఒక సెక్షన్ ఆఫీసుకు వచ్చే కొత్త.. పాత జీతాల్నిచూసినప్పుడు.. పాత దాని ప్రకారం

మూల వేతనం   రూ.37,100
పాత పీఆర్సీ ప్రకారం అన్ని డీఏలు.. మధ్యంతర భ్రతి 27 శాతం.. హెచ్ఆర్ఏ 30 శాతం పరిగణలోకి తీసుకుంటే..
మధ్యంతర భ్రతి  రూ.11,130
హెచ్ఆర్ఏ    రూ.10,017
డీఏ  రూ.20,607
మొత్తం రూ.78,854 వస్తుంది.
కొత్త పే స్కేల్ లెక్కను చూస్తే..
మూల వేతనం రూ.57,100
డీఏ   రూ.11,431
హెచ్ఆర్ఏ  రూ.9,136
మొత్తం జీతం రూ.77,667. అంటే పాత దానితో పోలిస్తే కొత్తగా వచ్చే జీతంతో రూ.1187 నష్టపోతాడు. ఈ లెక్కలోనూ మూలవేతనం చూస్తే భాగా పెరుగుతుంది. కానీ.. డీఏ.. హెచ్ఆర్ఏలు మాత్రం బాగా తగ్గిపోతుంది. చూసేందుకు మూలవేతనం భారీగా ఉన్నట్లు కనిపించినా.. మిగిలిన వాటిల్లో పడిన కోతలతో మొత్తంగా మారిపోతుంది. ఇదే.. ప్రభుత్వ ఉద్యోగుల్ని హాహాకారాలు చేసేలా మారి.. కొత్త జీతం వద్దు మహాప్రభు.. పాతది ఇచ్చి పుణ్యం కట్టుకోండంటూ బతిమిలాడే పరిస్థితి.