ములాయం కోడ‌లు బీజేపీలోకి.. అఖిలేష్‌కు దెబ్బ‌

ప్ర‌తిష్ఠాత్మ‌క ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాద‌వ్ దూసుకెళ్తున్నారు. అక్క‌డి చిన్న చిన్న పార్టీల‌తో పొత్తులు పెట్టుకుంటూ.. ప్ర‌ధాన పార్టీల నుంచి నేత‌ల‌ను చేర్చుకుంటూ ఎన్నిక‌ల స‌మ‌రంలో ముందుకు సాగుతున్నారు. ప్ర‌చారంలోనూ హోరెత్తిస్తున్నారు. బీజేపీపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త త‌మ పార్టీకి అనుకూలంగా మారుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇలా ఎన్నిక‌ల క్షేత్రంలో జెట్ స్పీడ్‌తో వెళ్తున్న ఆయ‌న‌కు.. బీజేపీ స‌డెన్ బ్రేక్ వేసింది. ఎస్పీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ములాయం సింగ్ యాద‌వ్ చిన్న కోడలు, అఖిలేష్ మ‌ర‌ద‌లు అప‌ర్ణ యాద‌వ్‌ను పార్టీలోకి చేర్చుకుంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ అప‌ర్ణ యాద‌వ్ బీజేపీలో చేర‌డం అక్క‌డి రాజ‌కీయాల్లో పెను దుమారం రేపుతోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ ఎస్పీకి ఈ షాక్ ఊహించ‌నిదే. స‌రిగ్గా ఎన్నిక‌ల వేళ త‌న బావ‌కు దిమ్మ‌తిరిగే షాకిస్తూ ఆమె కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఇది ఎస్పీకి కోలుకోలేని దెబ్బ అవుతుందిన విశ్లేష‌కులు భావిస్తున్నారు. ములాయం సింగ్ యాద‌వ్ రెండో భార్య సాధ‌నా గుప్తా త‌న‌యుడు ప్ర‌తీక్ భార్య ఈ అప‌ర్ణ‌. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో యూపీ డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్‌, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ఆధ్వ‌ర్యంలో ఆమె బీజేపీలో చేరారు. నిజానికి ఆమె బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నా వివిధ కారాణాల‌తో అది సాధ్యం కాలేదు.

ఈ ప‌రిణామంతో బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబంలో బీటలు ఏర్ప‌డ్డాయ‌నే చెప్పాలి. ఇన్ని రోజులు బీజేపీ నుంచి ఎస్పీలోకి కేబినేట్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరారు. దాదాపు ఓబీసీ నేత‌లంద‌రూ బీజేపీని వీడుతుండ‌డంతో ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. అందుకే అఖిలేష్ యాద‌వ్‌కే దిమ్మ‌తిరిగే షాకిచ్చేలా ములాయం స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల‌ను బీజేపీ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ములాయం సింగ్ స్నేహితుడు హ‌రి ఓం యాద‌వ్ బీజేపీలో చేర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇప్పుడు ఆ ఇంటి కోడ‌లు బీజేపీ తీర్థం పుచ్చుకుంది. 2017 ఎన్నిక‌ల్లో అప‌ర్ణ లక్నో కంటోన్మెంట్లో ఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌తీక్ యాద‌వ్, ఆయ‌న భార్య అపర్ణ చాలా కాలంగా బీజేపీ పెద్ద‌ల‌తో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. కానీ మ‌ధ్య‌లో ములాయం రాయ‌బారంతో విభేదాలు ప‌క్క‌న‌పెట్టి అఖిలేష్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తాన‌ని అప‌ర్ణ గ‌త నెల‌లోనే మీడియాకు తెలిపారు. కానీ ఇప్పుడు బీజేపీలో చేరిపోయి షాకిచ్చారు.