ఒకప్పటి స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు సప్తగిరితో

ఫిలిం ఇండస్ట్రీలో సినిమా సినిమాకు జాతకాలు మారిపోతుంటాయి. ఒక సినిమా హిట్టయితే దర్శకుడికి మంచి మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. ఫ్లాప్ అయితే అందరూ పక్కకు జరిగిపోతారు. ఇలా శుక్రవారం పొద్దున జాతకాలు మారిపోతుంటాయి. ‘మనసుతో’ అనే ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఎ.ఎస్.రవికుమార్ చౌదరిని అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. కొన్నేళ్ల పాటు కష్టపడి.. చివరికి హీరోగా విజయం కోసం చూస్తున్న గోపీచంద్‌ను లీడ్ రోల్‌లో పెట్టి పోకూరి బాబూరావు నిర్మాణంలో ‘యజ్ఞం’ తీశాడీ దర్శకుడు.

ఆ సినిమా సెన్సేషనల్ హిట్టవడంతో అతడికి డిమాండ్ పెరిగిపోయింది. నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్‌తో ‘వీరభద్ర’ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ ఛాన్స్‌ను అతను ఉపయోగించుకోలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో లాంటి సినిమాలు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఒక దశలో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయినట్లే కనిపించాడు రవికుమార్ చౌదరి. అందరూ అతణ్ని మరిచిపోయిన స్థితిలో ‘రేయ్’ సినిమాతో స్ట్రగుల్లో ఉన్న సాయిదరమ్ తేజ్‌ను హీరోగా పెట్టి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తీశాడు.

ఆ సినిమా సూపర్ హిట్టయి మళ్లీ రవికుమార్‌కు డిమాండ్ ఏర్పడేలా చేసింది. ఈసారి అతడి మీద అంచనాలు పెరిగిపోయాయి. భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లో గోపీచంద్ హీరోగా పెద్ద బడ్జెట్లో ‘సౌఖ్యం’ తీశాడు. మళ్లీ కథ షరామామూలే. సినిమా డిజాస్టర్ అయింది. రవికుమార్‌కు మళ్లీ డిమాండ్ పడిపోయింది. ఐదారేళ్లుగా అడ్రస్ లేడు రవికుమార్.

ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత అతడి కొత్త సినిమా అనౌన్స్ అయింది. అందులో హీరో సప్తగిరి కావడం గమనార్హం. కమెడియన్‌గా ఛాన్సులు వదులుకుని హీరో వేషాల వెంట పడి తన కెరీర్‌ను ఎటూ కాకుండా చేసుకున్నాడు సప్తగిరి. హీరోగా అతడికి ఏమాత్రం మార్కెట్ లేదు. ఇలాంటి హీరోతో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది రవికుమార్‌కు. బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసిన దర్శకుడికి ఇప్పుడు సప్తగిరితో సినిమా తీయాల్సిన స్థితి రావడం ఇబ్బందికరమే కదా.